ఖమ్మం, మార్చి 28: జిల్లా సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేశామని ఖమ్మం సీపీ సునీల్దత్, ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు పోలీసుల సమష్టి కృషి, సమాచార మార్పిడితో ఫ్రీ ఆండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆంతర్ రాష్ట్ర సరిహద్దు జిల్లాలో అక్రమ రవాణాను, చట్టవ్యతిరేక కార్యకాలాపాలను కట్టడి చేసేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఖమ్మం, ఏలూరు జిల్లాల పోలీస్ అధికారుల సమన్వయ సమావేశాన్ని గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ, ఎస్పీ మాట్లాడుతూ.. అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రవేశ, నిష్రమణ మార్గాల్లో 24/7 చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ విధుల్లో ఉండే పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని, సరిహద్దులో పటిష్ట నిఘా పెట్టాలని సూచించారు. అక్రమ మద్యం రవాణా, నగదు సరఫరాపై నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలన్నారు. ఎన్నికల నియమావళి పరిరక్షణే ధ్యేయంగా సరిహద్దు పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రౌడీ షీటర్లపైనా, గతంలో అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. సరిహద్దులో హైవే పెట్రోలింగ్, మొబైల్ పెట్రోలింగ్ పెంచాలని అన్నారు. పోలీస్ అధికారులు వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని సూచించారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పర సహకారంతో పనిచేస్తూ ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. సరహద్దుల్లో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయాలన్నారు. పోలీసు అధికారులు ప్రసాద్రావు, రఘు, ప్రసన్నకుమార్, రవిచందర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.