ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 21 : వర్తక సంఘం ఎన్నికలకు నామినేషన్లు సమర్పించేందుకు శుక్రవారంతో గడువు ముగిసింది. ఇక ప్రచార కార్యక్రమం తరువాయి కానుంది. వర్తకసంఘం ప్రధానశాఖతోపాటు మరో 18శాఖలకు సంబంధించి ఎన్నికల అధికారి పీబీ శ్రీరాములు నామినేషన్ల స్వీకరణకు 19, 20, 21 తేదీల్లో అవకాశం కల్పించారు. 22వ తేదీన పరిశీలన ఉండగా 23వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం పోటీల్లో ఉన్న అభ్యర్థులను ప్రకటించనున్నారు. మొత్తం 108 నామినేషన్లను సమర్పించినట్లు ఎన్నికల అధికారి పేర్కొన్నారు. 19శాఖలకు గాను 15శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, ఈసీ సభ్యులకు సింగిల్ సెట్ నామినేషన్లు దాఖలు కావడంతో 15శాఖలు ఏకగ్రీవం కానున్నాయి. వర్తక సంఘం ప్రధానశాఖతోపాటు మరో నాలుగు శాఖలకు మాత్రమే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
చివరి రోజున సంఘం తాజా మాజీ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావుతోపాటు ప్రధాన కార్యదర్శి పదవికి మరో దఫా గొడవర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యక్ష పదవికి పత్తిపాక రమేశ్, కోశాధికారిగా తూములూరి లక్ష్మీనర్సింహారావు, సహాయ కార్యదర్శి పదవి కోసం కురువెళ్ల కాంతారావు నామినేషన్ దాఖలు చేశారు. గొడవర్తి శ్రీనివాసరావు, మెంతుల శ్రీశైలం ప్యానళ్లుగా విడిపోయి పోటీలో నిలిచినప్పటికీ ఎవరూ తమ ప్యానల్ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేయకపోవడం విశేషం. దీంతో చిన్ని కృష్ణారావు ఇండిపెండెంట్గానే నామినేషన్ దాఖలు చేశారు. చిన్ని నామినేషన్ కార్యక్రమానికి సంఘం మాజీ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూరి,్త వేములపల్లి వెంకటేశ్వరరావు హాజరయ్యారు.