ఖమ్మం కల్చరల్, అక్టోబర్ 5: ‘శమీ శమీయతే పాపం.. శమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ..’ అనే శమీ శ్లోకం వాడవాడలా మిన్నంటింది. సర్వ జనులకు సకల విజయాలు అందించే జగన్మాతను దర్శించిన భక్తజనం పులకించిపోయింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన ముగ్గురమ్మల మూలపుటమ్మను తనివితీరా వీక్షించిన వారంతా ‘జయహో జగన్మాతా’ అంటూ కీర్తించారు. శమీ శ్లోకం, జమ్మి చెట్టు, స్వామి అమ్మవార్ల పూజలతో ఉమ్మడి జిల్లా అంతటా దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
బుధవారం జిల్లా ప్రజలు విజయదశమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని జమ్మిబండ జనసంద్రమైంది. శ్రీ రాజరాజేశ్వరదేవి, శ్రీనృసింహస్వామి ఇరువురు ఏకకాలంలో భక్తులకు దర్శనమివ్వడంతో భక్తకోటి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.. విజయదశమి పండుగను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, పాలేరు, వైరా డివిజన్లలో పట్టణాలు, పల్లెల్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఉదయం నుంచే ఇంటిల్లిపాదీ కలిసి దసరా వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఆయుధ పూజకు ప్రతీకగా భావించే విజయదశమి రోజున వ్యాపారులు, వాహనదారులు, రైతులతోపాటు సకల జనులు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ గ్రామాన ప్రజలందరూ కలిసి జమ్మిచెట్టుకు పూజలు చేశారు. శమీ శ్లోకంతో పాటు తమ గోత్రనామాలతో కుటుంబ సభ్యుల పేర్లతో, తమ మనసులోని కోరికలను కాగితాలపై రాసి శమీ వృక్షానికి వేలాడదీసారు. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఖమ్మంలోని శ్రీస్తంభాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి ఆలయం, మామిళ్లగూడెం, ఎన్నెస్పీ రోడ్డు రామాలయాలు, వేంకటేశ్వరస్వామి దేవాలయాలు, కాల్వొడ్డు, వైరారోడ్డు జలాంజనేయస్వామి ఆలయాలు, వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
కోలాహలంగా రావణ దహనం
జిల్లా కేంద్రంలోని పారువేట స్థలం ప్రాంతం జమ్మిబండ వద్ద భక్తుల సందడి నెలకొంది. ప్రతి సంవత్సరం కిటకిటలాడే జమ్మిబండ ప్రాంతంలో ఈ దఫా వర్షం కారణంగా కొంత ఆటంకం ఏర్పడింది. విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న జమ్మిబండ వద్ద అమ్మవారి దర్శనం, పూజలు చేసుకున్న భక్తులు శమీ పత్రాలతో పూజలు చేశారు. శ్రీమిత్ర గ్రూప్ కురువెళ్ల ప్రవీణ్కుమార్ సౌజన్యంతో జమ్మిబండ వద్ద ఏర్పాటు చేసిన భారీ పది తలల రావణాసురుడి విగ్రహాన్ని దహనం చేసి చెడుపై మంచి సాధించిన విజయాన్ని చాటారు.
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
జమ్మిబండ వద్ద అమ్మవారిని మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు వారియర్, మేయర్ నీరజ, సుడా, డీసీసీబీ చైర్మన్లు బచ్చు విజయ్కుమార్, కూరాకుల నాగభూషణం, టీఆర్ఎస్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు దర్శించుకున్నారు.
ఆయుధ పూజలో పాల్గొన్న మంత్రి
ఖమ్మం, అక్టోబర్ 5: విజయదశమి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హైదరాబాద్లోని తన అధికార నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆయుధ, వాహన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయాలను చేకూర్చే విజయదశమి ప్రతి కుటుంబంలోనూ వెలుగులు నింపాలని, ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆయుధ పూజ
మామిళ్లగూడెం, అక్టోబర్ 5: జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో సీపీ విష్ణు ఎస్ వారియర్ కుటుంబ సమేతంగా పాల్గొని సంప్రదాయరీతిలో ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధమూ ఎంతో శక్తిని కలిగి ఉంటుందని అన్నారు. విజయం చేకూర్చే విజయదశమి పర్వదినాన్ని పురసరించుకొని జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పోలీసుల కీర్తిప్రతిష్టలు పెంపొందాలని ఆకాంక్షించారు.