భద్రాచలం, అక్టోబర్ 5: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో బుధవారం నిర్వహించిన విజయదశమి సంబురాలు అంబరాన్నింటాయి. ఈ నెల 26న ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. విజయదశమి సందర్భంగా ఉదయం ఉత్సవమూర్తులకు ప్రాకార మండపంలో అభిషేక తిరుమంజనం నిర్వహించారు.
యాగశాలలో మధ్యాహ్నం 12 గంటలకు మహాపూర్ణాహుతి జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి పట్టుచీరె, గంధపుచెక్క, ముత్యం, పగడం, బంగారం అగ్నిహోత్రంలో వేశారు. స్వామివారి నిత్య కల్యాణం అనంతరం మహా పట్టాభిషేకం జరిపారు. శ్రీమద్రామాయణ పామహాకుంభాన్ని సమస్త మంగళవాయిద్యాలతో ఆలయ అధికారులతో మూలమూర్తులకు మహా కుంభ ప్రోక్షణ చేశారు. తిరిగి ఆలయ ప్రదక్షిణగా కిందకు వచ్చి, ఉత్సవ పెరుమాళ్లకు మహా కుంభప్రోక్షణ నిర్వహించారు. రామచంద్రుల ప్రభువుల వారికి తలపాగా ధరింపజేసి చక్రవర్తిగా ప్రత్యేక అలంకారం చేయించారు.
దేవస్థానం వారు 10 రోజులు పారాయణం చేసిన పారాయణదారులకు సన్మాన, సత్కారాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు గర్భాలయంలో మూలమూర్తుల వద్ద సాయంకాలపు ఆరాధన, రాజదర్బారు సేవ నిర్వహించారు. తరువాత సీతారామ, లక్ష్మణ ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ దసరా మండపం వద్దకు తీసుకొని వచ్చారు. భక్తరామదాసు నిర్మించిన దసరా మండపం వద్ద ఏటా విజయదశమి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ. మొదట శమీ వృక్షానికి పసుపు, కుంకుమలు చల్లి పూలమాల వేశారు. లక్ష్మి, అష్టోత్తర శతనామావళి పఠించారు. అనంతరం ఆయుధ పూజ చేశారు.
సరిగ్గా 6:6 నిమిషాలకు శ్రీరామ్లీలా మహోత్సవం ప్రారంభించారు. ప్రధానార్చకులు గడ్డితో తయారు చేసిన రావణుడి బొమ్మకు ప్రోక్షణ చేయగా దేవస్థానం ఈవో బానోత్ శివాజీ రావణ వధ గావించే శ్రీరామ్ లీలా మహోత్సవం నిర్వహించారు. రావణుడి బొమ్మపైకి ఈవో శరాన్ని సంధించి వదలగా కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా బాణసంచాను కాల్చడంతో మండపమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది. భక్తులు శమీ వృక్షానికి నమస్కరించుకున్నారు. తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కాగితంపై రాసి శమీ వృక్షానికి గుచ్చారు. జమ్మి ఆకులను కోసి శిరస్సుపై వేసుకున్నారు.