మామిళ్లగూడెం, అక్టోబర్ 4 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సంబంధించి మంగళవారం పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్లు, అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పరీక్షల నిర్వహణకు 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 17,366 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలను 13రూట్లుగా విభజించి ఒకో రూటుకు ఒక లైజన్ అధికారిని, ఒకో పరీక్షా కేంద్రానికి ఒక సహాయ లైజన్ అధికారిని నియమించామన్నారు.
పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు, తాగునీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యంతో పాటు ఇతర అన్ని వసతులు ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల కళాశాలల ప్రిన్సిపాల్స్తో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రానికి ఎలా వెళ్లాలనే రూట్ మ్యాప్ అభ్యర్థులకు తెలిసే విధంగా, ఒక రోజు ముందే పరీక్షా కేంద్రం చూసుకొనే విధంగా అవగాహన చేయాలన్నారు. ఒకే పేరు మీద ఉన్న కేంద్రాల విషయంలో అవి ఎకడెకడ ఉన్నాయి అనే దానిపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో ఏవి చేయాలి, ఏవి వద్దు అనే దానిపై అవగాహన కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రంలో ప్యాడ్కు అనుమతి లేదని, బయోమెట్రిక్ హాజరు ఉంటుందని, గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు అవగాహన కల్పించాలన్నారు. డ్యూయల్ డెస్లు పరిశీలించి, విరగటం, సరిగా లేని వాటి స్థానంలో మరొకటి ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి సెంటర్లో అభ్యర్థుల కేటాయింపు, గదుల లే అవుట్ మ్యాప్లు ప్రదర్శించాలన్నారు. తాగునీరు, టాయిలెట్లకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులకు సరిపోయే విధంగా గదుల్లో వెలుతురు ఉండాలని, ఫ్యాన్లు, లైట్లు చూసి, మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ భద్రతాపరంగా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు చేస్తామని తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్సురభి, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, అదనపు డీసీపీ ఎస్సీ బోస్, కలెక్టరేట్ ఏవో మదన్గోపాల్, అధికారులు, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ పరీక్షా కేంద్రాలుగా ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్జేసీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పారింగ్, టాయిలెట్స్, తాగునీరు, డ్యూయల్ డెస్లు పరిశీలించారు. సైన్ బోర్డుల ఏర్పాటుపై సూచనలు చేశారు. ఎంత మంది అభ్యర్థులు కేటాయించింది, ఎన్ని గదులు ఉన్నవి, సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు.