కల్లూరు, సెప్టెంబర్ 30 : కల్లూరులో నిర్మిస్తున్న మినీస్టేడియం పనులను కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. రూ.3.5 కోట్లతో మినీ స్టేడియం నిర్మిస్తున్నారు. ఈ పనులను నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను పరిశీలించి కాంట్రాక్టర్కు త్వరగా బిల్లులు చెల్లించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ బాలుర పాఠశాలలో ‘మన ఊరు- మన బడి’లో భాగంగా నిర్మిస్తున్న అదనపు గదుల భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీవో వీరస్వామి, జేఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ, సెప్టెంబర్30: మండలంలోని రెడ్డిగూడెంలో ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమం ద్వారా పాఠశాల బిల్డింగ్ పనులను శుక్రవారం కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. పాఠశాల భవన నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలన్నారు. జడ్పీ సీఈవో అప్పారావు, డీఈవో యాదయ్య, తహసీల్దార్ శ్రీలత పాల్గొన్నారు.
వైరా/వైరా టౌన్, సెప్టెంబర్ 30: పట్టణంలో రూ.1.92 కోట్లతో కొత్తగా చేపట్టిన స్టేడియం అభివృద్ధి పనులను శుక్రవారం కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని తెలిపారు. అనంతరం నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్వెజ్ మార్కెట్, షాదీఖానా నిర్మాణ పనులను పరిశీలించారు.
తొలుత కలెక్టర్కు వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్చైర్మన్ ముళ్లపాటి సీతరాములు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, సీఈవో వీవీ అప్పారావు, మండల ప్రత్యేకాధికారి కే సత్యనారాయణ, డీఎంహెచ్వో బీ మాలతి, డీఈవో, మున్సిపల్ కమిషనర్ వెంకటపతిరాజు, తహసీల్దార్ అరుణ, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ కే శ్రీనివాస్, టౌన్ప్లానింగ్ అధికారి భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.