కేంద్రంలోని బీజేపీ మతతత్వ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నది.. ప్రజల మధ్య మతచిచ్చు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది.. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ వనరులను కట్టబెడుతున్నది.. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వ్యాపారవేత్తల రుణాలను మాఫీ చేస్తున్నది.. నిత్యావసరాల
ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నది.. ప్రజలపై పన్నుల భారం మోపుతున్నది.. ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నది.. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడి అవసరం ఉందని, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగే సమర్థత ఆయనకే ఉందని పలువురు సర్పంచ్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు వెల్లడిస్తున్నారు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. – నమస్తే నెట్వర్క్
సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ బీజేపీ పాలనలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేంద్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీలు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. పాలించిన పార్టీలన్నీ ప్రజల జీవన స్థితిగతులను మార్చలేదు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నది. మతతత్వ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మానవాభివృద్ధి సూచికలో వెనుకబడి ఉన్నాం. పేదరికంలో వెనుకబాటులో ఉన్నాం. పిల్లలకు పోషకాహారం అందించడంలో వెనుకబడి ఉన్నాం. విధానాలు ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. క్రమంగా రాష్ర్టాలు హక్కులు కోల్పోతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ వంటి సమర్థత ఉన్న నాయకుడి అవసరం ఉంది. ఆయనే ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు.
– గుగులోత్ రామకృష్ణ, ఉపాధ్యాయుడు, పీఆర్టీయూ మండల కార్యదర్శి, బోనకల్లు
అన్నమాటపై నిలిచే వ్యక్తి కేసీఆర్..
ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి కేసీఆర్. ఏదైనా ప్రజలకు హామీ ఇచ్చారంటే అది కచ్చితంగా చేసి చూపిస్తారు. అంతటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళితే ప్రజలకు మేలు జరుగుతుంది. ఉద్యమ నేతగా ప్రజా సమస్యలను పూర్తిగా ఆకళింపు చేసుకున్న వ్యక్తిగా వారి రాతలు మార్చగలరు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేయగలరు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టగలరు. సాగునీటి వనరులను ఒడిసి పట్టి పంటలకు మళ్లించగలరు. రైతాంగం కోసం పథకాలు అమలు చేయగలరు.
– ఎండీ అస్లాం, ప్రైవేట్ ఉద్యోగి, కొత్తగూడెం
దేశం చూపు.. కేసీఆర్ వైపు..
బీజేపీ మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది. ప్రజలను మతం పేరిట విడగొడుతున్నది. అలాంటి మతోన్మాద పార్టీని ఎదుర్కోగలిగే శక్తి ఒక్క సీఎం కేసీఆర్కు మాత్రమే ఉంది. దేశమంతా ఇప్పుడు ఆయన వైపే చూస్తున్నది. అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడాయన. దేశాన్ని పాలించే అన్ని అర్హతలు ఆయనకున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాలను శాసించగలరు. ఆయన విజన్తో అక్కడ విజయం సాధించగలరు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబీమా, రైతుబంధు, పంటలకు 24 గంటల పాటు ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి. ప్రజలంతా కేసీఆర్కే మద్దతు ఇస్తారు.
– ఎండీ యాకూబ్ పాషా, ముస్లిం మైనారిటీ సంఘం జిల్లా అధ్యక్షుడు, కొత్తగూడెం
కేసీఆర్తోనే గ్రామ స్వరాజ్యం..
దేశంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. బీజేపీ పాలనలో అన్ని రంగాలు నిర్వీర్యమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ భవిష్యత్ను మార్చగలిగే నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలి. అంతటి సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్. ఇప్పుడు దేశమంతా ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నది. కేసీఆర్తోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఆయన విజన్తో ప్రతి గ్రామం అభివృద్ధి చెందింది. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పడ్డాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పల్లెలు హరితవనాలయ్యాయి. నిరుపేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఇలాంటి పథకాలు, అభివృద్ధే దేశమంతటా సాధ్యమవుతుంది.
– కొమ్మినేని ఉపేంద్ర, సర్పంచ్, రావినూతల, బోనకల్లు మండలం
దేశమంతటా రాష్ట్ర సంక్షేమ పథకాలు..
స్వరాష్ట్రం కోసం దశాబ్దాల పాటు ఉద్యమం జరిగింది. రాష్ర్టాన్ని సాధించలేక పోయాం. ఉద్యమ నేతగా కేసీఆర్ 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణను సాధించారు. పోరాట పటిమతో ఉమ్మడి పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారు. ఇటీవల జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఢిల్లీ గడ్డపై సత్తా చాటుతామని ప్రకటించారు. కేసీఆర్ నిర్ణయాన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో తప్పకుండా విజయం సాధించి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశమంతటా అమలు చేస్తారని విశ్వసిస్తున్నారు. ఇప్పుడు యావత్ దేశం కేసీఆర్ వైపు చూస్తున్నది. ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నది.
– కొడిమెల అప్పారావు, బ్రాహ్మణ సంఘం నాయకుడు, సత్తుపల్లి