భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్యారోగ్యశాఖ వరుస దాడులు నిర్వహిస్తున్నది. రిజిస్ట్రేషన్ లేకుండా, సౌకర్యాలు కల్పించకుండా, కాలంచెల్లిన మందులతో ల్యాబ్లు నిర్వహిస్తున్న యజమానులపై చర్యలు తీసుకుంటున్నారు. మూడురోజుల నుంచి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ దయానందస్వామి ఆధ్వర్యంలో 8 బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, అశ్వారావుపేట, పినపాక, బూర్గంపాడు, సారపాక, బంజర, చుంచుపల్లి మండలాల్లో అనుమతులు లేని ఆసుపత్రులను తనిఖీలు చేశారు.
డిప్యూటీ డీఎంహెచ్వోలు ఇద్దరు, ఆరుగురు ప్రోగ్రాం అధికారులు దాడులు చేసి ఆసుపత్రులను సీజ్ చేశారు. ఇప్పటివరకు 128 ఆసుపత్రులను తనిఖీ చేయగా అందులో 13 ఆసుపత్రులకు అనుమతులు లేవని గుర్తించి సీజ్ చేశారు. మరో 33 ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అట్టహాసంగా ఆసుపత్రులను ప్రారంభించి పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు వైద్యులు గుట్టు విప్పుతున్నారు. ఇంకా వారంరోజులపాటు దాడులు నిర్వహించనున్నారు.
అశ్వారావుపేటలో..
అశ్వారావుపేట, సెప్టెంబర్ 26: పట్టణంలోని పలు ఆరు ప్రైవేట్ ఆసుపత్రులు, ఐదు డయాగ్నస్టిక్ సెంటర్లను సోమవారం వైద్యారోగ్యశాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని ఆదిత్య, జీవన్ శ్రీ, వందన ఆసుపత్రులతోపాటు శ్రీదేవి, సాగర్ డయాగ్నస్టిక్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు అందించారు. వారంరోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. షోకాజ్ నోటీసులకు వచ్చే సమాధానాన్ని బట్టి యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీల నివేదికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందజేస్తున్నామన్నారు. తనిఖీల్లో సీహెచ్వో జి.నాగభూషణం, హెచ్ఈ రమణారెడ్డి, హెచ్ఈవో వెంకటేశ్వర్లు ఉన్నారు.
ఇల్లెందులో..
ఇల్లెందు, సెప్టెంబర్ 26: ఇల్లెందు పట్టణంలోని కొలిశెట్టి వెంకటేశ్వర మెమోరియల్ క్లినిక్, రవి ఆస్పత్రి, న్యూలైఫ్ ఆస్పత్రి, జయ క్లినిక్, శ్రీసాయి క్లీనిక్ను ఆదివారం వైద్యారోగ్యశాఖ బృందం సభ్యులు తనిఖీ చేశారు. సరైన అనుమతులు లేకపోవడంతో కొలిశెట్టి వెంకటేశ్వర మెమోరియల్ ని, రవి ఆస్పత్రి, శ్రీసాయి క్లినిక్ను సీజ్ చేశారు. న్యూలైఫ్ ఆస్పత్రి యాజమాన్యం సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో షోకాజ్ నోటీసులు అందించారు. తనిఖీల్లో వైద్యాధికారులు సంధ్యారాణి, ఇమ్మానుయేల్, రాంప్రసాద్, భద్రు పాల్గొన్నారు.