తెలంగాణ ఆడపడుచులకు ‘బతుకమ్మ’ ప్రత్యేకం.. వారెక్కడ ఉన్నా.. వేడుకలను కనుల పండువగా జరుపుకుంటారు. అయితే, బతుకమ్మ పండుగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏటా అతివలకు సర్కారు కానుకగా చీరెలను పంపిణీ చేస్తున్నది. రేషన్ దుకాణాల ద్వారా చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రేషన్ షాపు వద్ద సరైన స్థలం లేనిపక్షంలో ప్రభుత్వ పాఠశాల, కమ్యూనిటీ హాళ్లలో పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం సూచించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బతుకమ్మ చీరెలు చేరుకున్నాయి. వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆహార భద్రత కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ చీరె అందించనున్నారు. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, గురువారం ఖమ్మం జిల్లాలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేతుల మీదుగా మహిళలకు బతుకమ్మ కానుక అందించనున్నారు.
ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 21: ‘బతుకమ్మ’ కోసం జిల్లా ఆడబిడ్డలకు కానుకగా సీఎం కేసీఆర్ పంపిన చీరెలు మండలాలకు చేరుకున్నాయి. తహసీల్దార్ల నేతృత్వంలో రేషన్ దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆహార భద్రత కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ టీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన బతుకమ్మ చీరెలను అధికారులు అందించనున్నారు. ఖమ్మం జిల్లాలో 5,03,688 చీరెలను పంపిణీ చేయాల్సి ఉండగా మొదటి విడతగా ఇప్పటికే 3,08,519 చీరెలు చేరాయి. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం జిల్లాలో వీటి పంపిణీని గురువారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే చేరుకున్న బతుకమ్మ చీరెలను ఖమ్మం, వైరా, మధిర, నేలకొండపల్లి గోడౌన్లలో అధికారులు నిల్వ ఉంచి మండల కేంద్రాలకు పంపిస్తున్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ, పీఆర్, అంగన్వాడీ, సెర్ప్ సిబ్బంది సమన్వయంతో బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఏపీఎంలతో కూడిన కమిటీ పర్యవేక్షించనున్నది. బతుకమ్మ చీరెల పంపిణీలో గ్రామాల ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ షాపు వద్ద సరైన స్థలం లేనిపక్షంలో సమీపంలోని ప్రభుత్వ పాఠశాల, కమ్యూనిటీ హాళ్లలో పంపిణీ చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను ఈ నెల 30లోగా ముగించనున్నారు.
ఖమ్మం అర్బన్లో 82,361, ఖమ్మం రూరల్లో 29,480, సత్తుపల్లిలో 25,743, కల్లూరులో 24,796, తిరుమలాయపాలెంలో 24,691, మధిరలో 24,535, కూసుమంచిలో 23,358, కొణిజర్లలో 23,309, ముదిగొండలో 22,903, నేలకొండపల్లిలో 22, 361, సింగరేణిలో 20,241, తల్లాడలో 20,008, పెనుబల్లిలో 19,762, చింతకానిలో 19,724, వైరాలో 19,353, ఎర్రుపాలెంలో 18,872, వేంసూరులో 17,015, బోనకల్లులో 16,436, కామేపల్లిలో 16,425, ఏన్కూరులో 12,885, రఘునాథపాలెంలో 19,430 మంది మహిళలకు పంపిణీ చేయనున్నారు.
కొత్తగూడెం నియోజకవర్గంలో 97,181, ఇల్లెందు నియోజకవర్గంలో 61,254, భద్రాచలం నియోజకవర్గంలో 48,179, అశ్వారావుపేట నియోజకవర్గంలో 73,586, పినపాక నియోజకవర్గంలో 76,207, జూలూరుపాడు మండలంలో 12,469 మంది మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనున్నారు. నిరుటితో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది 2,788 మంది మహిళలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు.
బతుకమ్మ చీరెల పంపిణీ కార్యాక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం ప్రారంభించనున్నారు. ఖమ్మంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమంలో బతుకమ్మ చీరెలను మహిళలకు అందించనున్నారు. అనంతరం శాంతినగర్ జూనియర్ కళాశాల, నయాబజార్, గట్టయ్య సెంటర్ ఫ్రీడమ్ పార్కుల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తారు.
బతుకమ్మ చీరెలు జిల్లాకు చేరుకున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన వీటిని గురువారం జిల్లాలో మంత్రి అజయ్కుమార్ వీటి పంపిణీని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో చీరెలను లబ్ధిదారులకు అందిస్తాం. ఇప్పటికే జిల్లాలకు 80 శాతం చీరెలు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో మిగతావి రానున్నాయి.
-విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం
రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా పంపిన బతుకమ్మ చీరెలను జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ అందిస్తాం. ప్రభుత్వం ఇప్పటికే పంపిన చీరెలను గోదాముల్లో భద్రపర్చాం. ఇంకా మరికొన్ని చీరెలు రావాల్సి ఉంది. ఇప్పటి వచ్చిన చీరెల్లో మండల కేంద్రాలకు పంపించిన వాటిని కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధుల మంగళవారం ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు హాజరై రేషన్ దుకాణాల ద్వారా వీటిని అందజేస్తారు.
-జీ.మధుసూదనరాజు, డీఆర్డీవో, కొత్తగూడెం