ఇల్లెందు, సెప్టెంబర్ 21: ప్రజల ఆదరాభిమానాలు, మద్దతుతోనే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అఖండ శక్తిగా ఎదిగిందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఢీకొనే సత్తా ఏ పార్టీకీ లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ద్వారానే సరైన న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వాసంతో ఉన్నారని అన్నారు. బుధవారం ఇల్లెందులో పర్యటించిన ఆయన.. బొజ్జయిగూడెం సమ్మక్క సారక్క గద్దె నుంచి బైక్ ర్యాలీని ప్రారంభించారు.
భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి పట్టణమంతా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి తక్షణసాయం అందించడం తన నైజమని అన్నారు. ప్రజల మనిషిగా తనను ఆదరిస్తున్న తీరును చూస్తుంటే చాలా గర్వంగా, సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం ఇల్లెందులోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఆయా కాలనీల్లో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు పాల్గొన్నారు.