ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 18: భద్రాద్రి బ్యాంక్ అంటేనే ప్రజల బ్యాంక్ అని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని వాసవీ గార్డెన్లో బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షతన ఆదివారం జరిగిన భద్రాద్రి బ్యాంక్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మాట్లాడారు. ‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్లుగా భద్రాద్రి బ్యాంక్ అనతి కాలంలో లక్షలాది మంది ఖాతాదారుల మన్ననలను చూరగొన్నదన్నారు. తద్వారా ప్రస్తుతం రూ.600 కోట్ల డిపాజిట్లతో రూ.900 కోట్ల టర్నోవర్కు చేరుకున్నట్లు చెప్పారు. బ్యాంకు మున్ముందు మరింత పురోభివృద్ధి సాధించాలని, మరిన్ని శాఖలు విస్తరించాలని ఆకాంక్షించారు. నిబద్ధతకు మారుపేరుగా ముద్రపడిన చైర్మన్ ఉండడంతో నేడు బ్యాంక్ మంచి లాభాల బాటలో పయనిస్తున్నదన్నారు. అనంతరం ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడారు. రానున్న రోజుల్లో బ్యాంక్ సేవలను పొరుగు జిల్లాలకూ విస్తరించాలన్నారు. అనంతరం అతిథులను బ్యాంకు పాలకవర్గ బాధ్యు లు సత్కరించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, బ్యాంక్ పాలకవర్గ బాధ్యులు కూరాకుల నాగభూషణం, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, లక్ష్మీప్రసన్న, సన్నె ఉదయ్ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వర్లు, చిన్ని కృష్ణారావు, నరేశ్కుమార్, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, గరికపాటి వెంకట్రావ్, రేఖల భాస్కర్, విజయకుమారి, కామేశ్వరరావు పాల్గొన్నారు.