టీఆర్ఎస్ సర్కారులోనే రఘునాథపాలెం సమగ్రాభివృద్ధి
అభివృద్ధిపై బురదజల్లే వారికి తగిన సమాధానం చెప్పాలి
ఖాళీ జాగాలో ఇంటి నిర్మాణానికి త్వరలోనే రూ.3 లక్షలు
కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో మంత్రి పువ్వాడ
రఘునాథపాలెం, సెప్టెంబర్ 9: గడిచిన ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి ప్రగతి నివేదికను గడపగడపకూ తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలోనే రఘునాథపాలెం మండలం సమగ్రాభివృద్ధి సాధించిందని అన్నారు. ఈ అభివృద్ధి గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం రఘునాథపాలెం రైతువేదికలో ఆయా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమ పథకాల గురించి ప్రగతి నివేదిక తయారు చేసుకోవాలని శ్రేణులకు సూచించారు. ప్రతి ఊరిలో ఎన్ని ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది.
రైతుబంధు కింద ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల నిధులు అందుతున్నాయి అనే ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి రానున్న ఎన్నికల్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇంతటి అభివృద్ధి జరగలేదని, ఇంతటి సంక్షేమం అందలేదని, కేసీఆర్ హయాంలోనే ఇవన్నీ జరిగాయనే విషయం ప్రజలకు తెలియజేయాలని సూచించారు. తమ హయాంలో తమ గ్రామాల్లో ఇంతింత అభివృద్ధి చేశామని గొప్పగా చెప్పుకునే అదృష్టం ఈ దఫా సర్పంచ్లకు దక్కినందుకు వారు సంతోషించాలని అన్నారు. ఇంటి జాగా కలిగిన ప్రతి నిరుపేదకూ ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం త్వరలోనే అందుతుందన్నారు. ఈ ఏడాది ఈజీఎస్ కింద రూ.12 కోట్లను మండలంలోని సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఏ మండలంలోనూ ఈ స్థాయిలో ఒకే మండలానికి ఇంత పెద్ద మొత్తంగా నిధులు వచ్చిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.
ఐకమత్యంగా ఉండాలి..
గ్రామాల్లోని టీఆర్ఎస్ శ్రేణులన్నీ ఐకమత్యంతో ఉండాలని మంత్రి సూచించారు. ఎన్నికల సమయంలో బేదాభిప్రాయాలను వీడి కలిసికట్టుగా ఉండాలన్నారు. నాయకులు ఐకమత్యంగా ఉంటేనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మంత్రిగా అజయ్ మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. నేతలు మంత్రి చేత కేక్ కట్ చేయించారు. అనంతరం మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు అజ్మీరా వీరూనాయక్, భూక్యా గౌరి, మాలోత్ ప్రియాంక, గుత్తా రవికుమార్, కుర్రా భాస్కర్రావు, మద్దినేని వెంకటరమణ, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మందడపు నర్సింహారావు, పిన్ని కోటేశ్వరరావు, మాదంశెట్టి హరిప్రసాద్, గుడిపుడి శారద, లక్ష్మణ్నాయక్, బోయినపల్లి లక్ష్మణ్గౌడ్, జంగాల శ్రీనివాసరావు, మెంటెం రామారావు, దారా శ్యాం, రావెళ్ల మాధవి, నున్నా శ్రీనివాసరావు, దొంతు సత్యనారాయణ, తహసీల్దార్ నర్సింహారావు, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.