కామేపల్లి, సెప్టెంబర్ 3: కామేపల్లి మండలంలో ప్రవహించే వాగులు పండితాపురం సమీపంలోని సీతబంధం వాగు, ముచ్చర్ల సమీపంలోని నిమ్మవాగులు. వానకాలం వచ్చిందంటే చాలు వాగులు పొంగి మండలంలోని గ్రామాలతో పాటు డోర్నకల్, ఖమ్మం వైపు వెళ్లే రహదారులు బంద్. రోజుల తరబడి జల దిగ్బంధమే. ఇక ఆ ప్రాంతంలో పంటలు సాగు చేస్తున్న రైతులు పొలం పనులన్నీ నిలిచిపోవడం తప్ప మారో మార్గం ఉండేది కాదు. ప్రయాణికులు 40 -50 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకునేవారు. రెండు వాగులపై బ్రిడ్జీలు నిర్మించాలని గ్రామస్తులు నాటి ప్రభుత్వాలను కోరినా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సమస్యలకు పరిష్కారం చూపింది. నాటి ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యేక చొరవతో రెండు వాగులపై వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పూర్తి చేయించారు.
నిమ్మవాగు రూ.3.35 కోట్లతో బ్రిడ్జి..
ముచ్చర్ల సమీపంలోని నిమ్మవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా నాటి ప్రభుత్వాన్ని కోరారు. అయినా స్పందన లేదు. వానకాలం వచ్చిందంటే వాగు ఉప్పొంగేది. దీంతో కెప్టెన్ బంజర, మద్దులపల్లి, లాల్యతండా గ్రామస్తులతో పాటుగా ఏన్కూర్ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొన్నిసార్లు రోజుల తరబడి వాగు ప్రవాహం తగ్గేది కాదు. దీంతో ప్రయాణికులు కెప్టెన్బంజర మీదుగా కామేపల్లి చేరుకునేవారు. అక్కడి నుంచి ఖమ్మం వెళ్లాల్సి వచ్చేది. ఇలా మరో 40 కిలోమీటర్ల ప్రయాణం అదనంగా ఉండేది. 2018లో నాటి ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.35 కోట్ల నిధులు విడుదల చేయించారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ప్రయాణికుల కష్టాలు తీరాయి.
సీతబంధం వాగు రూ.కోటిన్నరతో బ్రిడ్జి
వానకాలంలో పండితాపురం-బండిపాగు మధ్య సీతబంధం వాగు ఏటా ఉప్పొంగేది. దీంతో గోవింద్రాల, రాయిగూడెం, రుక్కితండా, బండిపాడు గ్రామాలతో పాటు డోర్నకల్ వైపు రవాణా నిలిచిపోయేది. సమస్యను అప్పటి ప్రభుత్వానికి వివరించినా ఎలాంటి స్పందన లేదు. వానలు ఆగిపోయిన తర్వాత అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేసి చేతులు దులుపుకొనే వారు. మళ్లీ వర్షం వస్తే తిరిగే ఇదే సమస్య. ముఖ్యంగా పంటలు సాగు చేసుకునే రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రెండు, మూడు రోజులు పొలం పనులు ఆగిపోయేవి. నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాటి ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో రూ.కోటిన్నరతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. దీంతో వాహనదారులు, రైతులకు రవాణా ఇబ్బందులు తప్పాయి.
రవాణాకు ఇబ్బంది లేదు..
వానకాలంలో సీతబంధం వాగు ఉప్పొంగేది. ఏటా రవాణాకు ఇబ్బందులు పడేవాళ్లం. ప్రభుత్వం చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మించడంతో పండితాపురం, బండిపాడు, రుక్కితండా, రాయిగూడెం, గోవింద్రాల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. ఇప్పుడు వానకాలమైనా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
– ధనియాకుల నరసింహారావు,రైతు, పండితాపురం
రాకపోకలకు ఆటంకం లేదు..
వానకాలంలో పండితాపురం- బండిపాడు మధ్య రాకపోకలకు ఆటం కం లేకుండా వాగుపై ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించింది. గతంలో వాగు పొంగి వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. సమస్యకు పరిష్కారం చూపిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– చల్లా వెంకటనారయణ, రైతు, పండితాపురం