ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 9 : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. తరాలు మారి కొత్త తరాలు వస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాట సందర్భంలో జరిగిన సమరం, త్యాగాలు, ప్రాణత్యాగాలు, అందరూ ఐక్యంగా కదిలిన తీరు, పోరాట యోధుల చరిత్ర కొత్త తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘గాంధీ’ చిత్రాన్ని విద్యార్థులకు చూపించాలని నిర్ణయం తీసుకున్నది. తొమ్మిది రోజులపాటు థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా తొలిరోజు మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 16,750 మంది విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారు. ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు, సీపీ, ఎస్పీ, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి గాంధీ చిత్రాన్ని తిలకించారు. అంతేకాకుండా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మువ్వన్నెల జెండాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. గాంధీజీ జీవిత చరిత్ర, స్వాతంత్య్ర పోరాట ఘట్టాలు విద్యార్థులకు తెలిసేలా తొమ్మిది రోజులపాటు థియేటర్లలో ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. జాతిపిత గాంధీ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘గాంధీ’ చిత్రాన్ని జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 8,517 మంది విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారు. ఖమ్మంలోని కేపీఎస్ ఆదిత్య, వినోద, సాయిరాం, శ్రీనివాస థియేటర్లలో గాంధీ చిత్రం ప్రదర్శించగా.. కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణువారియర్లు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జీవిత చరిత్ర ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సినిమా చూశారు.
తొలిరోజు రెసిడెన్షియల్ విద్యార్థులు..
తొలిరోజు గాంధీ చిత్రాన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు తిలకించారు. మంగళవారం మొహర్రం సెలవుదినం కావడంతో రెసిడెన్షియల్ విద్యార్థులకు అవకాశం కల్పించారు. దీంతో గురుకుల విద్యార్థులు, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల విద్యార్థినులు ఈ చిత్రాన్ని వీక్షించారు. ఒక్కో థియేటర్లో మూడు నుంచి నాలుగు పాఠశాలల విద్యార్థులను కేటాయిస్తూ బ్యాచింగ్ చేశారు. బాలికలు, బాలురు వేర్వేరుగా సినిమా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
8,517 మంది విద్యార్థుల వీక్షణ..
జిల్లావ్యాప్తంగా 8,517 మంది విద్యార్థులు వీక్షించినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. జిల్లాలో 17 థియేటర్లు ఉండగా.. నగరంలో ఏడు థియేటర్లున్నాయి. విద్యార్థుల కోసం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతోపాటు రవాణాశాఖ అధికారులు బస్సులను ఏర్పాటు చేశారు. నోడల్ అధికారులు పాఠశాలల వివరాలు, విద్యార్థుల సంఖ్యను నమోదు చేసుకొని ఉన్నతాధికారులకు అందజేశారు.
మువ్వన్నెల జెండా పంపిణీ..
ఖమ్మం జిల్లాలో మువ్వన్నెల జెండాల పంపిణీ జోరుగా సాగుతున్నది. జిల్లా కేంద్రంతోపాటు అన్ని ప్రాంతాల్లో జెండాలు పంపిణీ ప్రారంభించారు. ఈ వేడుకల్లో అధికార యంత్రాంగంతోపాటు ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జాతీయ జెండాలను ఇంటిపై ఎగురవేస్తూ స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మహానీయుల చరిత్రను పిల్లలకు వివరిస్తున్నారు.
ప్రపంచమే నేర్చుకొనేలా మహోజ్వల భారత నిర్మాణం వైపు అందరం పురోగమించాలి. ఇందుకోసం స్వాతంత్య్ర వజ్రోత్సవ స్ఫూర్తితో ముందుకు కదలాలి. దేశ భవిష్యత్తు కోసం, అన్నార్తులు, అనాథలు లేని దేశం కోసం జాతిపిత మహాత్మాగాంధీ చూపిన
దారిలో పునరంకితం కావాలి.
– సీఎం కేసీఆర్