ఖమ్మం కల్చరల్/ అన్నపురెడ్డిపల్లి/ బూర్గంపహాడ్/ జూలూరుపాడు/ కరకగూడెం/ కూసుమంచి/ కూసుమంచి రూరల్/ మణుగూరు రూరల్/ పాల్వంచ/ పాల్వంచ రూరల్/ పెనుబల్లి/ రామవరం/ తల్లాడ/ ఎర్రుపాలెం, ఆగస్టు 9 : త్యాగ నిరతికి ప్రతీకగా, ముస్లిం అమరవీరులకు స్మరణగా ఉమ్మడి జిల్లాలోని ముస్లింలందరూ మొహర్రంను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.చావిడి నుంచి తెచ్చిన పీర్లను పురవీధుల్లో ఊరేగించారు. ప్రాణత్యాగం చేసిన ముస్లిం వీరులు ఇమామే హుస్సేన్, ఇమామే హసన్ను స్మరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఉద్వేగంగా తమ వీరుల త్యాగ నిరతిని చాటారు. త్యాగమయుల ప్రతీకగా హస్తాకృతిలో గల పీర్లను నూతన వస్ర్తాలు, పుష్పాలతో అలంకరించి పుర వీధుల్లో ఊరేగించారు. వీధుల్లోకి వచ్చిన పీర్లకు ప్రజలు నీళ్లారబోస్తూ హుస్సేన్ సోదరులను స్మరించారు. ఈ వేడుకలో ముస్లిమేతరులు కూడా పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. పీర్ల చావిళ్ల వద్ద పీర్లను ప్రతిష్ఠించి అగ్నిగుండాల చుట్టూ తిరుగుతూ వీరుల ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.
ఖమ్మం నగరంలోని ఖిల్లాబజార్ శివాలయం సమీపంలో, తుమ్మలగడ్డ, శుక్రవారిపేట, నిజాంపేట, రిక్కాబజార్, మమత హాస్పిటల్ రోడ్, పుట్టకోట, రేవతిసెంటర్ తదితర ప్రాంతాల్లో పీర్లను ప్రతిష్ఠించి అక్కడి నుంచి నగర వీధుల్లో ఊరేగింపు చేశారు. పది రోజులపాటు ప్రతి రోజూ పీర్ల చావిడి నుంచి పీర్లను నగరంలో ఊరేగించి ఉత్సవాలు నిర్వహించగా చివరిరోజు మంగళవారం ‘షహాదత్’గా నగరంలోని అన్ని పీర్ల చావిళ్లలోని పీర్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరేగించి అమరుల త్యాగాలను స్మరించారు. అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో నిర్వహించిన వేడుకల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రావు, జడ్పీటీసీ భారత లాలమ్మ, ఎంపీటీసీ సీత పాల్గొన్నారు.
బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో పీరీలను జాతీయ జెండా ఆకారంలో అలంకరించారు. కూసుమంచి మజీద్ వద్ద భారీ జన సందోహం మధ్య వేడుకలు జరిగాయి. మణుగూరు మదీనా నగర్ పీవీకాలనీ, పట్టణంలోని శివలింగాపురం గ్రామాలకు చెందిన భక్తులు కందూర్లు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. వేడుకల్లో కొత్తపల్లి ఖాసీం, లక్ష్మయ్య, సీతారాములు, సత్యనారాయణ, మహేశ్, సైదులు, సాంబశివరావు పాల్గొన్నారు. పాల్వంచ గడియకట్ట పీరీల ఊరేగింపులో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, హజ్రత్ మౌలాలీ, భట్లు కళ్యాణ్, లక్ష్మణ్, షేక్ మున్నా, షేక్ అన్వర్, వంశీ, భవాని, షేక్ బన్ను, ఆలీ పాల్గొన్నారు. తల్లాడలో ఎస్సై పి.సురేశ్ పాల్గొని స్థానిక నాయకులు, మహిళలు, చిన్నారులతో కలిసి నృత్యం చేశారు. హెడ్కానిస్టేబుల్ సాంబశివరావు, రాధాకృష్ణ, పీర్ల ముజావర్, షేక్ ఈసూబ్, శ్రీనివాసరెడ్డి, రఘు, చాంద్పాషా, మేహరాజ్, షరీఫ్, పాషా, సోందు, పాల్గొన్నారు.