రఘునాథపాలెం, ఆగస్టు 3 : తెలంగాణ సర్కారు.. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తోందని అన్నారు. ఖమ్మం అర్బన్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని 364 మంది విద్యార్థినులకు ద్విభాషా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అజయ్.. కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో నాణ్యమైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలే చిరునామాగా నిలుస్తున్నాయని గుర్తుచేశారు. విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం సరిగ్గా అందుతున్నదా? లేదా? అంటూ స్వయంగా విద్యార్థులను ఆరా తీశారు.
‘సమీకృత కలెక్టరేట్’ త్వరితగతిన పూర్తవ్వాలి
నూతన కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖలన్నీ ఒక వేదికలో ఉండి ప్రజలకు నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో రూ.44 కోట్లతో వీ వెంకటాయపాలెం వద్ద ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం పరిశీలించారు. గత నెలలో పరిశీలించిన పనుల్లో ఇప్పటికీ పురోగతి లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనుల్లో నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. భవనం మొత్తం కలియతిరిగి విద్యుత్ పనులు, ఫ్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్, టైల్స్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, ఏఈ విశ్వనాథ్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, రావూరి కరుణ, సుడా డైరెక్టర్ దేవభక్తుని కిషోర్బాబు, డీఈవో యాదయ్య, ఎంఈవో శ్రీనివాస్, రాజశేఖర్, కేజీబీవీ ఎస్వో, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.