ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 4: ‘మన ఊరు- మన బడి’ పథకాన్ని అమలు చేసి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈవిద్యాసంవత్సరం నుంచి 1-8వ తరగతి విద్యార్థులకు ఆంగ్లమాధ్యమం అమలు చేస్తున్నది. ఈమేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనున్నది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా 426 ప్రభుత్వ పాఠశాలలు మొదటి దశకు ఎంపిక కాగా ఇప్పటికే 241 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ పాఠశాలల్లో పనులు మొదలైన జిల్లాల్లో ఖమ్మం ప్రథమ స్థానంలో నిలిచింది. సంగారెడ్డి జిల్లా 224 స్కూల్స్ ప్రారంభించి రెండోస్థానం, 184 స్కూల్స్ ప్రారంభించి నల్గొండ మూడోస్థానం, 176 స్కూల్స్ ప్రారంభించి భద్రాద్రి జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది.
మండలాల వారీగా..
జిల్లాలో 21 మండలాలు ఉండగా ‘మన ఊరు-మన బడి’కి మొదటి దశలో బోనకల్ మండలం నుంచి 15 స్కూళ్లు, చింతకాని 16, ఏన్కూరు 16, కల్లూరు 23, కామేపల్లి 18, ఖమ్మం అర్బన్ 26, ఖమ్మం రూరల్ 23, కొణిజర్ల 19, కూసుమంచి 23, మధిర 21, ముదిగొండ 18, నేలకొండపల్లి 22, పెనుబల్లి 24, రఘునాథపాలెం 21, సత్తుపల్లి 22, సింగరేణి 24, తల్లాడ17, తిరుమలాయపాలెం 25, వేంసూరు 18, వైరా 16, ఎర్రుపాలెం నుంచి 19 స్కూల్స్ ఎంపికయ్యాయి. మొత్తం 426 పాఠశాలల్లో ఈనెల 4వ తేదీ నాటికి 241 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి.
ప్రత్యేక చొరవతోనే..
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. 12 అంశాల్లో పనులను గుర్తించారు. అంచనాలను రూపొందించే ప్రక్రియను శరవేగంగా పూర్తి చేశారు. ఖమ్మం కలెక్టర్ గౌతమ్ ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాలల అభివృద్ధి పనులకు సర్కారు నుంచి పరిపాలనపరమైన అనుమతులు తీసుకువచ్చారు. ఆయా పాఠశాలల్లో పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. అధికారులు నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ పనులు చేపడుతున్నారు. మంత్రి అజయ్కుమార్ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి వారం ఇంజినీరింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
శరవేగంగా పనులు..
‘మన ఊరు- మన బడి’కి ఎంపికైన పాఠశాలల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పనులను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం, సత్తుపల్లి, ఖమ్మం పంచాయతీరాజ్ ఈఈలు, ఖమ్మం, సత్తుపల్లి ఆర్అండ్బీ ఈఈలు, ట్రైబల్ వేల్ఫేర్ ఈఈ, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ ఖమ్మం శాఖలు పనులు చేపట్టాయి. సుమారు రూ.60 కోట్ల నిధులతో పనులు సాగుతున్నాయి. మొత్తం 12 అంశాల్లో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నది.