మణుగూరు రూరల్, జూలై 4 : అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న మణుగూరుతోపాటు అన్ని వర్గాలు, కులాలకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే న్యాయం జరుగుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ సింగరేణి, బీటీపీఎస్ సీఎస్ఆర్ నిధులు మొత్తం ఏడు కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో కాపు కమ్యూనిటీ హాల్కు రూ.50 లక్షలు, ముస్లిం కమ్యూనిటీ హాల్కు రూ.50 లక్షలు, శాలివాహన భవన్కు రూ.25 లక్షలు (కుమ్మరి సంఘం కమ్యూనిటీ హాల్), చాకలి ఐలమ్మ భవన్కు రూ.25 లక్షలు, అంబేద్కర్ భవన్కు రూ.25 లక్షలు, బాబు జగ్జీవన్రామ్ భవన్కు రూ.25 లక్షలకు అనుమతులకు ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో ఇంకా కొన్ని కుల సంఘాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. కొమరం భీం భవన్(అశ్వాపురం), సేవాలాల్ భవన్(అశ్వాపురం), యాదవ్ సంఘ భవన్(అశ్వాపురం) కల్లుగీత కార్మికులు గౌడ కులస్తుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న భవన్( కరకగూడెం), బాపనకుంటలో పిల్లల పార్కుకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా ఉద్యోగ విరమణ పొంది ఇంట్లోనే ఉంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్న సీనియర్ సిటిజన్స్కి రిక్రియేషన్ క్లబ్కు నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, చిన్నపిల్లలకు సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు సీఎస్ఆర్ ద్వారా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. చిన్న కులాలు, రెడ్డి, కమ్మ కులాలకు నిధుల వెసులుబాటుతో స్థలాల వెసులుబాటుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో అన్ని కులాలను గౌరవిస్తూ… ఆత్మగౌరవ ప్రతీకలుగా భవనాలను నిర్మిస్తానన్నారు. పైవన్నీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని దసరాకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.