కొత్తగూడెం క్రైం, జులై 1 : భద్రాద్రి జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అధికారి సునీల్ దత్ను రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగూడెం ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న జీ వినీత్కి ఉద్యోగోన్నతి కల్పిస్తూ జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది. పాల్వంచ ఏఎస్పీ రోహిత్రాజును భద్రాచలం ఏఎస్పీగా బదిలీ చేసింది. ఉత్తరాఖండ్ రాష్ర్టానికి చెందిన సునీల్ దత్ 2014లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రొబేషనరీ కాలపరిమితి ముగిశాక 2017లో భద్రాచలం ఏఎస్పీగా తొలి బాధ్యతలు స్వీకరించారు. 2018 మార్చిలో జగిత్యాల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ఆరు నెలలు పని చేసిన ఆయనకు భద్రాది కొత్తగూడెం ఎస్పీగా బదిలీ అయ్యింది. సెప్టెంబర్ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.
సునీల్ దత్ నాలుగేళ్ల కాలపరిమితి అనంతరం బదిలీ అయ్యారు. ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్డీగా ఉన్న వినీత్కి ఉద్యోగోన్నతి కల్పిస్తూ జిల్లా ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది. కర్నాటక రాష్ర్టానికి చెందిన వినీత్ జీ మొదట వైద్యవృత్తిలో కొనసాగుతూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. 2017లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఖమ్మంలో ప్రొబేషనరీ కాలపరిమితి ముగిశాక వినీత్ భద్రాచలం ఏఎస్పీగా 2020 నవంబర్ 9వ తేదీన తొలి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉద్యోగోన్నతి పొందిన వినీత్ జీ 2021 డిసెంబర్ 1వ తేదీన నిజామాబాద్ అదనపు డీసీపీ (శాంతి భద్రతలు)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 4వ తేదీన నిజామాబాద్ నుంచి బదిలీపై వచ్చిన వినీత్ కొత్తగూడెం ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయనకు మళ్లీ ఉద్యోగోన్నతి లభించడంతో జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
పాల్వంచ ఏఎస్పీగా విధుల నిర్వర్తిస్తున్న బిరుదరాజు రోహిత్రాజును భద్రాచలం ఏఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వరంగల్ జిల్లాకు చెందిన బిరుదరాజు రోహిత్ 2018లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. జిల్లాలో లాక్ డౌన్ సమయంలోనే ప్రొబేషనరీ కాలపరిమితి పూర్తి చేసుకుని 2021లో గ్రేహౌండ్స్కు బదిలీ అయ్యారు. మళ్లీ జిల్లాకు అటాచ్మెంట్లో వచ్చిన ఆయన కొంత కాలం కొత్తగూడెం ఇన్చార్జ్ ఏఎస్పీగా పని చేశారు. అనంతరం అక్టోబర్లో పాల్వంచ ఏఎస్పీగా ఇన్చార్జ్ బాధ్యతలు స్వీకరించారు. గ్రేహౌండ్స్ నుంచి జిల్లాలో అటాచ్మెంట్ విధులు నిర్వర్తిస్తున్న రోహిత్ రాజుకు భద్రాచలం ఏఎస్పీగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.