ఖమ్మం వ్యవసాయం, జూన్ 29 : ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో బుధవారం తేజా రకం ఏసీ మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. ఉదయం జరిగిన జెండాపాటలో వ్యాపారులు పోటీ పడడంతో గరిష్ఠ ధర క్వింటాల్ రూ.22 వేలు పలికింది. మధ్య ధర రూ.20,100 కాగా.. కనిష్ఠ ధర రూ.18,500 చొప్పున నిర్ణయించి వ్యాపారులు పంట కొనుగోలు చేశారు. వివిధ జిల్లాల నుంచి రైతులు ఏసీలో నిల్వపెట్టిన 3,800 బస్తాలను అమ్మకానికి పెట్టారు. కొద్దిరోజుల నుంచి మార్కెట్కు పంట తాకిడి తగ్గడంతో అదేస్థాయిలో డిమాండ్ పెరుగుకుంటూ వస్తున్నది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే క్వింటాల్కు రూ.2 వేలు పెరిగింది. రెండేళ్ల క్రితం ఇదే మార్కెట్లో ఏసీ రకం మిర్చిపంట క్వింటాల్ రూ.21,500 పలికి అప్పట్లో రికార్డు సృష్టించింది. రెండేళ్ల అనంతరం మరో రూ.500 పెరిగి రూ.22 వేలకు చేరింది.