సాగులో మెళకువలు పాటిస్తే లాభాల బాట
వానకాలంలో పత్తి సాగుపై రైతుల ఆసక్తి
గతేడాది కంటే పెరగనున్న సాగు విస్తీర్ణం
వానకాలం సీజన్ ప్రారంభమైంది. కొన్నిచోట్ల రైతులు దుక్కులు సిద్ధం చేస్తుండగా.. మరికొన్నిచోట్ల విత్త నాలు నాటే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, తక్కువ వర్షపాతం ఉన్నా.. మంచి దిగుబడులు వస్తుండడంతో రైతులు పత్తి సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏడు నెలలపాటు పంట కాలం ఉంటుంది. సాగులో మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించడంతోపాటు లాభాలు పొందే అవకాశం ఉంది. దీంతో ఏటేటా జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది.
కూసుమంచి, జూన్ 27: కొన్నేళ్లుగా పత్తికి ధర లేకపోవడం, చీడపీడలతో పంటకు నష్ట వాటిల్లడంతో రైతులు ఏటా సాగు విస్తీర్ణం తగ్గిస్తూ వస్తున్నారు. మూడేళ్ల నుంచి తిరిగి సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ వస్తున్నారు. పత్తి సాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం వానకాలం సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే 60శాతం మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు. కొన్నిచోట్ల దుక్కులు సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో విత్తనాలు నాటే ప్రక్రియ పూర్తవుతుందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తక్కువ వర్షపాతం ఉన్నా పత్తిలో మంచి దిగుబడులు వస్తుండడంతో రైతులు దీని సాగుపైనే ఆసక్తికనబరుస్తున్నారు. ఏడు నెలల పాటు పంట కాలం ఉంటుందని, పత్తి తీత నెలల పాటు ఉండడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉందని రైతులు వెల్లడిస్తున్నారు.
వానలు పడితే మేలు..
సాధారణంగా పత్తికి నల్లరేగడి నేలలు అనుకూలం. కానీ రైతులు ఇప్పుడు అన్ని రకాల భూముల్లోనూ సాగు చేస్తున్నారు. వానకాలం మొదలైనప్పటి నుంచి 60 మి.మీ వర్షపాతం నమోదైతే వర్షాధారంగా పత్తి విత్తనాలు నాటేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నీటి వసతి కలిగిన రైతులు ఇప్పటికే సాగు ప్రారంభించారు. ఒక ప్యాకెట్ బీటీ విత్తనాలకు ప్రభుత్వం రూ.810 ధర నిర్ణయించింది. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
యాజమాన్య పద్ధతులు ఇవీ..
వర్షాధారంగా సాగు చేసే రైతులు తొందరగా పూత, కాత వచ్చే రకాలు, మధ్యస్థంగా చిన్నసైజు రకాలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి ఉన్న చోట సాగు కొంచెం ఆలస్యంగా పూత కాత వచ్చే మధ్యస్థ పెద్ద కాయసైజు ఉండే రకాలను ఎంపిక చేసుకోవాలి. పత్తి ఎకరానికి వేసే మొక్కల సంఖ్య, విత్తే దూరం, నేల స్వభావం, నీటి వసతి, వేసే రకాన్ని బట్టి యాజమాన్య పద్ధతుల్లో మార్పులు ఉంటాయి.
నల్ల రేగడి, మధ్యస్థం, ఎర్ర నేలలు, తేలికపాటి భూముల రకాలను బట్టి విత్తనాల మోతాదులో ఎక్కువ తక్కువలు ఉంటాయి. అధిక సాంద్రత గల నేలల్లో ఎకరాకు 25,000 నుంచి 35,000 మొక్కలు నాటవచ్చు. వర్షాధారంగా పండించే విధానంలో సాలీన ఎకరానికి 9.13 క్వింటాళ్లు దిగుబడి సాధించవచ్చు. సూటికాయ 60/20 సెం.మీ దూరం, హైబ్రీడ్ 80/20 సెం.మీ దూరంలో నాటుకోవాలి. అధిక సాంద్రత గల పత్తి సాగులో వరుస మధ్య దూరం 45-60 సెం.మీ, మొక్కల మధ్య దూరం 10-15 సెం.మీ ఉండేలా చూసుకోవాలి. ఈ విధానంపై వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
రెండు ఎకరాల్లో పత్తి సాగు..
నాకున్న రెండు ఎకరాల్లో పత్తి గింజలు నాటుతున్నా. ఈసారి రెండు రకాల విత్తనాలు కొనుగోలు చేశా. గతేడాది పత్తి సాగు చేశా. దిగుబడి తగ్గింది. కానీ మంచి రేటు ఉండడంతో మేలు జరిగింది. ఈసారి తొలకరికే పత్తి పెడుతున్నా. వర్షాధారంగానే పంట సాగు చేస్తున్నా. ఈసారిమంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. – అర్వపల్లి వెంకన్న, రైతు, కూసుమంచి
ఎరువులు వేసే విధానం..
సూటి రకంలో సాగుకు నత్రజని, భాస్వరం, పొటాషియం ఎకరానికి 16:24:24 కిలోలు వాడాలి. సిఫార్సు చేసిన భాస్వరం ఎరువు మొత్తాన్ని విత్తే ముందు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. నత్రజని, పోటాష్ను సమభాగాలుగా విత్తిన 30-40 రోజులు, 65-75 రోజులకు వేయాలి. హైబ్రీడ్ రకంలో నత్రజని, భాస్వరం, పొటాషియం ఎకరానికి 48:24:24కిలోలు వాడాలి. సిఫార్సు చేసిన భాస్వరాన్ని విత్తే ముందు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. నత్రజని, పోటాష్ను సమ భాగాలుగా 30-40రోజులు, 65-75 రోజులకు వేయాలి.