ఖమ్మం లీగల్, జూన్ 23: ఈ నెల 26న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి డాక్టర్ తట్టా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13 నుంచే ముందస్తు లోక్ అదాలత్ కేసులు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, ఇల్లెందుల్లో జాతీయ లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్లో సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు, ఇతర సివిల్ దావాలు పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకొని సమన్యాయం, సత్వర న్యాయం పొందాలని, సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావీద్పాషా పాల్గొన్నారు.