మామిళ్లగూడెం, జూన్ 20: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం తదుపరి చర్యల కోసం సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీదారులు కూడా భూ సమస్యలు పరిష్కరించాలని, డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో శిరీష, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తాటి, ఈత చెట్లను నరకడం నేరం: కలెక్టర్
మామిళ్లగూడెం, జూన్ 20: తాటి, ఈత చెట్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, వీటిని నరకడం నేరమని కలెక్టర్ వీపీ గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఆబ్కారీ చట్టం 1968లోని సెక్షన్-27 ప్రకారం తాటి, ఈత చెట్లను ప్రభుత్వ అనుమతి లేకుండా నరకడం నేరమని, బెయిల్ కూడా మంజూరు కాదని, నేరం రుజువైతే నిందితులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. తాటి, ఈత కల్లును ఆయుర్వేద మందుల్లో వాడతారని, అధిక మోతాదులో మినరల్స్, విటమిన్స్ ఉన్నాయని అన్నారు. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.