కామేపల్లి, మే 28;‘హలో.. ఎవరూ నర్సాగౌడు మామేనా? నేను చింతకింది రమేశ్ను!’ ‘ఆ.. అల్లుడూ అంత మంచిదేనా.. ఏం సంగతీ?’ ‘ఏం లేదు మామా! ఇయాళ ఖమ్మంకేలి నా సోపతిగాళ్లత్తర్రు.. పోద్దాడు కల్లు ఒక్క శెట్టుది దింపి, జెర పక్కకువెట్టు..’ ‘ఆ.. శెట్టు మీన్నే ఉన్న.. గట్లనే పెడ్తతియ్యి అల్లుడూ!’ ‘జెర నీళ్లుగీళ్లు గల్పకు.. మాటవోతది!’‘నీ కంటె ఎక్కువనా అల్లుడూ.. గట్లనే తీ!’పొద్దుగాల పొద్దుగాల గౌండ్లోళ్లు గట్ల తాళ్లెక్కుతన్రో లేదో, గిట్ల ఫోన్లు మోగుతన్నయి. పొద్దెక్కకముందే ఉన్న కల్లంత బుక్కయితంది. మిగిలినోళ్లకు అడుగుబొడుగే దిక్కయితంది. సెలవురోజుళ్ల జిల్లాల ఏ తాళ్లళ్ల చూసినా జాతర లెక్కే కనిపిస్తంది. పొద్దుగూట్లె పడ్డంకనే మండువల దగ్గర సందడి తగ్గుతంది. బయట దొరికే బ్రాందీ, విస్కీ, బీరు కన్నా ధర తక్కువ కావడం, ప్రకృతి ఒడిలో సేదదీరే అవకాశముండడంతో కల్లుకు రోజురోజూ ఆదరణ పెరుగుతంది. ఆంగ్ల మద్యం ఆరోగ్యానికీ హానికరం కావడం, కల్లులో అంతోఇంతో ఔషధ గుణాలుండడం వల్ల యువత కూడా సురాపానానికి ఓటేస్తంది.
తాటిచెట్లకూ పేర్లు..
కల్లు ప్రియులు, గీతకార్మికులు తాటిచెట్లకు చిత్ర విచిత్ర పేర్లు పెట్టి మరీ, వాటి కల్లును తాగేందుకు ఇష్టపడుతారు. ఇందులో సినిమా హీరో హీరోయిన్లు, రాజకీయనాయకులు, చేపల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. నాటికాలపు హీరోయిన్లు జమున, సావిత్రి మొదలుకొని సిల్క్స్మిత, రంభ, ఊర్వశి, మేనక, సిమ్రాన్, సౌందర్య, రోజా, నయనతార, ఇలియానా దాకా, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జునలాంటి హీరోలతోపాటు, రాజీవ్గాంధీ, ఇందిరా, సోనియా, జయప్రద, కేసీఆర్, కేటీఆర్, చంద్రబాబు, ఒబామాలాంటి రాజకీయ నాయ కుల పేర్లే గాక ఊటశెలిమె, బంగారుతీగ, ఆగంకాకి, గడ్డివా ము, కైక, మోహిని, సారాసీసా, మోసగాడు లాంటి ఎన్నో పేర్లు పెడుతుంటారు. ఒకప్పుడు తాటి చెట్టుకు ఎవరైనా తా ము అనుకున్న పేరు పెడితే గౌడ పెద్ద మనుషులకు పార్టీ ఇ చ్చే సంప్రదాయం ఉండేది. తాటిచెట్ల పంపంకం సమయం లో చెట్టుకు పేరు పెట్టి, చెట్ల వివరాలు రాసే బుక్(సారుకోల)లో నమోదు చేసేవారు. ఈ విచిత్రమైన పేర్లున్న తాటికల్లుకోసం కొందరు పడిచచ్చేవారు. “అబ్బా జమున కల్లు ఏముందిరా..’ అంటూ లొట్టలేసుకుంటూ తాగేవాళ్లు.
ఎన్నో రోగాలకు దివ్య ఔషధం..
తెల్లకల్లుతో జీర్ణకోశ వ్యాధులు, మూత్ర సంబంధవ్యాధులు నయమవుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డా, పచ్చకామెర్లు వచ్చినా, అమ్మవారు పోసినా తెల్లకల్లు తాగించాలని డాక్టర్లు సైతం చెబుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈతకల్లు క్రమం తప్పకుండా తాగితే శరీరంలో ఉన్న వేడి తగ్గుతుందని చెబుతుంటారు. అనేక ఆయుర్వేద మందుల్లో ఈతకల్లు కలిపి తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. పోద్దాటి, పండుదాటి కల్లు బాలింతలకు ఆరోగ్యమని చెబుతారు. సహజసిద్ధంగా లభించే కల్లు తాగి రమన్ని సలహా ఇచ్చే డాక్టర్లకూ జిల్లాలో కొదవ లేదు.
ఈ ప్రాంతాలు తెల్లకల్లుకు ఫేమస్…
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చాలా ప్రాంతాలు తెల్లకల్లుకు ఫేమస్. ఊరికో చోట తాటివనం కనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ కల్లు తాగేందుకు బంధువుల ఇళ్లకు వస్తుంటారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని గోపాలపురం, కోయచలక, మంచుకొండ, గోళ్లపాడు, ముత్తగూడెం, కామంచికల్, ఆరెకోడు, తల్లంపాడు, తెల్దారుపల్లిల్లో తెల్లకల్లు విస్తృతంగా లభిస్తుంది. బోనకల్లు మండలంలో ముష్టికుంట్ల, గోవిందాపురం, ముదిగొండ మండలం బాణాపురం, నేలకొండపల్లి మండలం బోదులబండ, కూసుమంచి మండలం చేగొమ్మ, జీళ్లచెరువు, గోపాల రావుపేట, ఇల్లెందు మండలం ముకుందాపురం, చల్లసముద్రం, టేకులపల్లి మండలం బేతంపూడి.., కారేపల్లి మండల కేంద్రంతో పాటు దాదాపు అన్నిగ్రామాల్లో, తిరుమలాయపాలెం మండలంలో బీరోలు, బచ్చోడు, రాజారం, కాకరవాయి, మహ్మదాపురం.., చింతకాని, కొత్తగూడెం, పాల్వంచ, చండ్రుగొండ, ఏన్కూరు, తల్లాడ, వైరా, మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి, దమ్మపేట, వేంసూరు మండలాలు తెల్లకల్లుకు ఫేమస్. ఇవేకాకుండా ప్రతి ఊరికీ తాటి వనం ఉండడం మన జిల్లా ప్రత్యేకత. జిల్లాలో కల్తీలేని కల్లు దొరుకుతుందనే నమ్మకం ఉంది. పలువురు కల్లు ప్రేమికులు పేరున్న గీత కార్మికులతో దోస్తానా చేసి, వారికి బ్రాందీ, బీర్లు తాగించి, నచ్చిన కల్లు తాగడం కనిపిస్తుంటుంది. ఆదివారాలు వచ్చాయంటే చాలు తాటి వనాలు కల్లు ప్రియులతో కళకళలాడుతుంటాయి.
పండితాపురం తాళ్లు చాలా ఫేమస్..
కామేపల్లి మండలం పండితాపురం శివారులోని తాళ్ల కల్లు చాలా ఫేమస్. గ్రామానికి చెందిన 100 మంది గీత కార్మికులు కల్లు తీస్తారు. గ్రామంలో రూ.1000 – 1500 తాటి చెట్లు ఉంటాయి. ప్రస్తుత సీజన్లో ప్రతిరోజు వెయ్యి లీటర్లకు పైగా కల్లు తీస్తారు. గీత కార్మికులు నాణ్యమైన కల్లు విక్రయిస్తుండడంతో చుట్టుపక్కన గ్రామాల ప్రజలూ ఇక్కడ కల్లు తాగడానికి వస్తారు. పట్టణాల బాటిళ్లలో కల్లు తీసుకెళ్తారు.
మూడు కాలాలు.. నాలుగు సీజన్లు..
తాటిచెట్లలో ఆడ, మగ రకాలుంటాయి. నాప, పరుపు, పండుతాళ్లను ఆడ చెట్లుగా, పోద్దాళ్లను మగ చెట్లుగా భావిస్తారు. ఏడాది పొడువునా నాలుగు సీజన్లుగా విభజిస్తారు. ఒక్కో సీజన్కు ఒక్కో పేరుంటుంది. చలికాలం ఆరంభంలో నాపతాళ్ల సీజన్ (ఆడ చెట్లు) మొదలవుతుంది. తాటి వనంలో ఏవో కొన్ని చెట్లు మాత్రమే గెలలు వేస్తాయి. వీటి నుంచి వచ్చే కల్లు తాగితే త్వరగా నిషా ఎక్కుతుంది. ఆ తర్వాత వచ్చేది పోద్దాళ్ల (మగ చెట్ల)సీజన్. డిసెంబర్ నుంచి మార్చి వరకు నా లుగు నెలలు పోద్దాటి కల్లు లభిస్తుంది. ఈ కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు, అనుభవజ్ఞులు చెబుతుంటారు. అందుకే పోద్దాళ్ల సీజన్ పూర్తయ్యే వరకు తాటివనాలు కిటకిటలాడుతాయి. ఆ తర్వాత ఎండాకాలం ప్రారంభమయ్యే సమయంలో పరుపుతాళ్ల సీజన్ వస్తుం ది. వర్షాలు పడే సమయంలో వచ్చేది పండుతాళ్ల సీజన్.
కల్లు ఇలా వస్తుంది..
ఆయా సీజన్లలో చెట్లు గెలలు వేస్తాయి. వాటిని గౌడ కులస్తులు ముందుగానే గుర్తించి, వాటి చుట్టూ ఉన్న మట్టలు తొలగించి, శుభ్రం చేస్తారు. గెలను రోజుకు రెండు, మూడుసార్లు మెర (సన్నగా గీయడం) వేస్తారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఒకవేళ ఒకటి రెండు రోజులు మెర వేయకపోతే ఆ గెలలు ఇక పనికి రావు. నాలుగైదు రోజులు క్రమం తప్పకుండా మెర వేస్తే ఆ గొల నుంచి కొంచెకొంచెంగా నీర వస్తుంది. కుమ్మరి కులస్తుల దగ్గర ప్రత్యేకంగా చేయించిన కుండలు(లొట్లు) తెచ్చి ఒక్కో గెలకు ఒకటి చొప్పున కడతారు. నాలుగైదు రోజుల్లో లొట్ల అడుగుభాగంలో మడ్డి(కల్లు జిగురు) అట్టులా పేరుకుపోతుంది. రోజూ వచ్చే కల్లును గౌడ కులస్తులు సాయంత్రం వేళలో ఎక్కి కిందికి దింపుతారు. గెలకు కట్టిన లొట్టి మడ్డి పడితే కల్లు తెలుపు రంగులోకి మారుతుంది. తాగితే మత్తు వస్తుంది.
తాటికల్లుకు గిరాకీ ఎక్కువ..
జిల్లాలో తాటికల్లుకు గిరాకీ ఎక్కువ. మద్యం దుకాణాల్లో ఎన్ని రకాల బ్రాందీ, విస్కీ, బీరు అందుబాటులో ఉన్నా.. తాటిచెట్ల నుంచి సహజ సిద్ధంగా లభించే కల్లును తాగేందుకు మెజార్టీ ప్రజలు ఇష్టపడుతున్నారు. పట్టణాల నుంచి ఫోన్ల ద్వారా గౌడ కులస్తులకు ఆర్డర్లు ఇచ్చి మరీ కల్లు తాగేందుకు వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక పండుగలు, పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు ఉన్నప్పుడు, ఆదివారం, సెలవురోజుల్లో తాటివనాలు కిటకిటలాడుతున్నాయి. బర్త్డే పార్టీలు, ఫ్రెషర్స్డే రోజైతే వనంలో ఉన్న కల్లు మొత్తం తమకే పోయాలని యువత ముందుగానే డబ్బులు అడ్వాన్స్గా ఇవ్వడం కనిపిస్తోంది. వివిధ పట్టణాల్లో ఉన్న వారు తమ బంధుమిత్రులను తాళ్లకు వెంటబెట్టుకొని వెళ్లడం, కల్లు రుచిచూపించడం ఇటీవల కాలంలో పెరిగింది.
దీనికితోడు కుటుంబ సభ్యులంతా కలిసి కల్లు తాగడం అలవాటుగా మారింది. ఉదయాన్నే మాంసం వండుకుని, చపాతీలు చేసుకుని వనాలకు వెళ్లడం, అక్కడ కుండ చికెన్, బొంగుచికెన్ తదితర వంటకాలు చేసుకుని ఇంటిళ్లిపాదీ ఎంజాయ్ చేయడం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఈతకల్లుకూ డిమాండ్ ఉంటోంది. బీరు, బ్రాందీ తాగినా సరే.. చివరన తెల్లకల్లు తాగనిదే తృప్తి చెందని వారికి జిల్లాలో లెక్కలేదు. చాలా మంది వృద్ధులు సాయంత్రమైతే చాలు, కల్లుబొట్టుతో గొంతు తడుపుకోనిదే నిద్రపోరు. రోజూ పొద్దున పాలు తెప్పించుకున్నట్లే ఏడాది పొడుగునా వాడిక పట్టి మరీ కల్లు తెప్పించుకుంటారు. కల్లు తాగని రోజు నిద్రకూడా పోని వారు కూడా ఎందరో ఉన్నారు.
గౌడ కులస్తులకు గౌరవం..
కల్లు పారిందంటే గ్రామాల్లో గౌడ కులస్తులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఆదివారం, పండగ, సెలవు రోజుల్లో కల్లుకు గిరాకీ ఎక్కువ. చాలాచోట్ల వారం ముందు చెబితే గానీ కల్లు దొరకని పరిస్థితి. అందుకే కల్లుప్రియులు గౌడ కులస్తుల ఫోన్ నంబర్లు సేకరించి, ముందుగానే బుక్ చేస్తారు. ‘అన్నా.. నేను రేపు పొద్దుగాల కల్లుకు వస్తన్నా. గా పుట్టమీది చెట్టు కల్లు నాకే ఉంచు.’ అంటూ వరుసలు కలుపుతారు.
నీరాకు డిమాండ్..
జిల్లాలో ఈత నీరకు సైతం డిమాండ్ ఉంటోంది. ఈతచెట్టును కొత్తగా గీసే సమయంలో చెట్టు నుంచి చుక్క చుక్కగా వచ్చే పానీయాన్ని నీరగా పిలుస్తారు. కొబ్బరి నీళ్లకంటే ఇవి ఎంతో శ్రేష్ఠంగా, రుచికరంగా ఉంటాయి. దీనిని కల్లుగా గుర్తించరు. ఇందులో మత్తు పదార్థం ఉండదు. నిషా కూడా రాదు. అందుకే ఈ పానీయాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు. సాయంత్రం వేళలో ఈతచెట్లను గీసి కుండ కడతారు. కల్లు రుచిగా ఉండేందుకు నవోతు, ఇలాచీ, పుదీనా వేస్తారు. దీంతో నీర మరింత రుచికరంగా తయారవుతుంది. తెల్లవారకముందే ఈ నీరను ఈతచెట్టు నుంచి తీసి అక్కడే తాగుతారు. ఈ నీర తాగితే కిడ్నీలో రాళ్లు సైతం కరుగుతాయని చాలామంది భావిస్తారు.
నీర, కల్లులో ఇవీ ఔషధ గుణాలు..
కులవృత్తిలోనే ఆనందం..
నేను వారసత్వంగా గీత వృత్తిలోకి వచ్చాను. మా కుటుంబానికి కల్లు గీత ఆసరా అయింది. నేను వ్యవసాయం చేస్తూనే ఎనిమిదేండ్లుగా కల్లు గీస్తున్నాను. కల్లు ద్వారా ఆదాయం బాగానే ఉన్నది. అన్నింటికీ మించి కల్లు గీయడం ఆనందాన్నిస్తున్నది. కులవృత్తిలో కొనసాగడమే నాకు సంతోషం.
– మేకపోతుల రామ్మూర్తి, గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు, పండితాపురం
మితంగా తాగాలి..
కల్లు ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా తీసుకోవాలి. అతిగా తీసుకుంటే అనారోగ్యం పాలవక తప్పదు. కల్లులోని పోషకాలు ఆర్యోగాన్ని కాపాడతాయి. గతంలో కల్లు తీతకు గీత కార్మికులు మట్టి కుండలు వాడేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లు వాడుతున్నారు. బాటిళ్లు వాడకుండా మట్టి కుండలనే వాడితే బాగుంటుంది.
– నారగాని రాంప్రసాద్గౌడ్, వైద్యుడు, ఖమ్మం