మామిళ్లగూడెం, మే 28: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురికి టోకరా వేసిన భార్యాభర్తలు రూ.1.88 కోట్లు వసూలు చేసిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. ఖమ్మం వన్టౌన్ సీఐ చిట్టిబాబు కథనం ప్రకారం.. ఖమ్మంలోని సుగ్గల వారి తోట ప్రాంతానికి చెందిన దాసరి సరిత.. తమ కుటుంబ సభ్యులకు రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు రూ.36 లక్షలు తీసుకొని మోసం చేసిందంటూ ఖమ్మంలోని చెరువుబజార్కు చెందిన పాలవెళ్లి తులసి, డౌలే సునీతలు సీపీ విష్ణు ఎస్ వారియర్కు ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాల మేరకు.. దాసరి సరితపై కేసు నమోదు చేసిన ఖమ్మం వన్టౌన్ పోలీసులు సమగ్ర విచారణ ప్రారంభించారు. దాసరి సరిత, ఆమె భర్త ముద్దం శ్రీకాంత్ (26) (ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన ఇతడు ప్రస్తుతం తల్లాడ పీఎస్ కానిస్టేబుల్) కలిసి ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
దాసరి సరిత తాను రైల్వే డిపార్డుమెంట్లో గెజిటెడ్ అధికారిని అని ఫేక్ ఐడీ కార్డు తయారు చేసుకుంది. దానిని వారి బంధువులు, స్నేహితులు, ఇతరులకు చూపిస్తూ రైల్వేలో వివిధ హోదాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికేది. కానిస్టేబుల్ అయిన తన భర్త శ్రీకాంత్తో కలిసి సుమారు 12 మంది నుంచి సుమారు రూ.1.88 కోట్లు వసూలు చేసింది. ఈ డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ.. స్థిర, చర ఆస్తులు కొనుగోలు చేశారు. దాసరి సరిత 2015 నుంచి ఈ వ్యవహారం నడుపుతోంది. ఖమ్మంలో ఆరు నెలలుగా ఈ మోసాలకు తెరలేపింది. అయితే, నిందితులు వసూలు చేసిన మొత్తంలో చాలా వరకూ రికవరీ చేశామని సీఐ తెలిపారు. నిందితులను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. కానిస్టేబుల్పై శాఖాపరమైన చర్యలకు ప్రతిపాదన పంపినట్లు వివరించారు.