లక్ష్మీదేవిపల్లి, మే 27: భద్రాద్రి అడవుల్లో చేపడుతున్న అడవుల రక్షణ, అభివృద్ధి చర్యలు అద్భుతమని, జంతురక్షణ కోసం చేపట్టిన వినూత్న చర్యలు రాష్ర్టానికే తలమానికమని అటవీ ముఖ్య సంరక్షణాధికారి ఆర్ఎం డోబ్రియల్ పేర్కొన్నారు. కొత్తగూడెం జిల్లా అడవుల్లో శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. అటవీశాఖ చేపడుతున్న అడవుల రక్షణ చర్యలు, ఎదుర్కొంటున్న సవాళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తగూడెం, రామవరం రేంజ్ల పరిధిలో వేలాది హెక్టార్లలో పెంచిన ప్లాంటేషన్లను సందర్శించారు. వాటిని పెంచడంలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన క్షేత్రస్థాయి అధికారులను అభినందించారు. చాతకొండ, రామవరం, పెనగడప రిజర్వు ఫారెస్టుల్లో చేపట్టిన అద్భుతమైన అటవీ పునరుజ్జీవన చర్యలపై ప్రత్యేక డాక్యుమెంటరీ చేయబోతున్నట్లు చెప్పారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన నీటి కుంటలు, చెక్డ్యాంలు, సాసస్ పిట్లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యంగా వన్యప్రాణుల కోసం అమలుచేస్తున్న ప్రత్యేక సంరక్షణ చర్యలు, గడ్డి మైదానాలు రాష్ర్టానికే తలమానికంగా ఉన్నాయన్నారు. అన్యాక్రాంతమైన అటవీ భూములను సస్యశ్యామలం చేయడంలో కొత్తగూడెం అటవీ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అడవుల్లో మంటల నివారణకు అనుసరిస్తున్న చర్యలు, కలుపు మొక్కల నివారణకు అనుసరిస్తున్న విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. రామవరం రేంజ్లోని జగ్గంపేట గొత్తికోయ ఆవాసాన్ని సందర్శించి వారితో మాట్లాడారు. అడవుల రక్షణలో అటవీశాఖకు తోడ్పాటును అందించాలని కోరారు. తరువాత మణుగూరు డివిజన్లోని సందిళ్లపాడు నర్సరీ, ప్లాంటేషన్లను సందర్శించి పలు సూచనలు చేశారు. మున్సిపాలిటీ కోసం అటవీశాఖ పెంచుతున్న పొడవైన మొక్కలు పెంపక కేంద్రాన్ని సందర్శించి అంకితభావంతో పెంచుతున్న అధికారులను అభినందించారు. కొత్తగూడెం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు భీమానాయక్, ఇన్చార్జి డీఎఫ్వో ప్రవీణ, ఎఫ్డీవోలు నీరజ్, అప్పయ్య, దామోదర్రెడ్డి, తిరుమలరావు, బాబు, రేంజ్ ఆఫీసర్లు సురేశ్, ఉమ, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.