ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 22 :నవ మాసాలు మోసి పండంటి బిడ్డకు లోకాన్ని పరిచయం చేసే క్రమంలో అమ్మను, ఆమెకు పుట్టబోయే బిడ్డను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సిజేరియన్ ఆపరేషన్లను తీవ్రంగా పరిగణిస్తున్నది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి 100 ప్రసవాల్లో 45 ప్రసవాలు సాధారణ కాన్పులు జరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగడంతో వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం అభినందనలు తెలిపింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఖమ్మం వైద్యులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ప్రైవేట్ దవాఖానల్లో అడ్డగోలు ప్రసవాలు, జరుగుతుండడం, 80 శాతానికి పైగా సిజేరియన్స్ కావడం వంటి అంశాలను తీవ్రంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం ‘కోత’ ప్రసవాలకు కారణాలు తెలపాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనికితోడు ప్రసవాలకు ముహూర్తాలు పెట్టవద్దంటూ పురోహితులను హెచ్చరించింది.
ప్రసవం.. ప్రతి గర్భిణికి పునర్జన్మ. నవ మాసాలు మోసి పండంటి బిడ్డకు లోకాన్ని పరిచయం చేసే క్రమంలో ‘ఆమె’ నరకం అనుభవిస్తుంది. ప్రాణాలను ఫణంగా పెట్టి మరో తరానికి స్వాగతం పలికే సందర్భంలో ‘అమ్మ’ కడుపుపై కత్తులు కవాతు చేస్తున్నాయి. ‘తల్లి’ తనువునంతా రక్తసిక్తం చేస్తున్నాయి. తద్వారా మిగిలిన జీవితమూ దుర్భరమయంగా మారుతోంది. నాగరిక సమాజంలో ఆటవిక పోకడలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కారణం లేనిదే కాన్పు సమయంలో సర్జరీ చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది.
దీంతో సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. తప్పనిసరి అయితేనే గర్భిణికి అపరేషన్ చేస్తున్నారు. కానీ.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ‘కాన్పు’ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ధనార్జనే ధ్యేయంగా యాజమాన్యాలు పెద్దాపరేషన్లతో అనాగరిక పద్ధతులు అవలంబిస్తున్నాయి. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని, ఉమ్మనీరు తాగిందని సాకులు చెప్పి ‘సిజేరియన్’ చేస్తున్నాయి. కొంతకాలంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో నమోదవుతున్న ప్రసవాల తీరుతెన్నులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ సర్కార్ తల్లీ, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించింది. ప్రతీ జిల్లా కేంద్రంలో మాతా, శిశు కేంద్రాలను నెలకొల్పి అద్భుతమైన సేవలకు నాంది పలికింది. దీంతో ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఎంసీహెచ్ విభాగం సాధారణ ప్రసవాలకు కేంద్ర బిందువుగా మారింది. రోజుకు వందల సంఖ్యలో గర్భిణులు రకరకాల పరీక్షల కోసం వస్తుండగా, సరాసరి 25 నుంచి 30 ప్రసవాలు జరుగుతుండడం గమనార్హం. జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పురుడు పోస్తున్నారు.
2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 30 వరకు నమోదైన గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 9,138 ప్రసవాలు జరిగాయి. వాటిల్లో 3,770 మందికి సాధారణ కాన్పులు జరిపించగా.. 5,368 మందికి ఆపరేషన్ల ద్వారా ప్రసవం చేశారు. ఆ ప్రకారం సాధారణ కాన్పుల నిష్పత్తి సరాసరి 40 నుంచి 45 శాతంగా ఉందని ఖమ్మం జిల్లా వైద్యారోగ్య, వైద్య విధాన పరిషత్ అధికారులు పేర్కొంటున్నారు. సదరు గణాంకాల ఆధారంగా సర్కారు దవాఖానలపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని వైద్య నిఫుణులు స్పష్టం చేస్తున్నారు. కాగా.. ఖమ్మం జిల్లాలో ప్రసవాల తీరుతెన్నులపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ వారానికి ఒకసారి సమీక్షిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన డీఎంహెచ్వో డాక్టర్ మాలతి తమ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. సుఖ ప్రసవాలపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రైవేట్లో అడ్డగోలు కోతలు
జిల్లా వైద్యారోగ్యశాఖకు అందిన వివరాల మేరకు గడిచిన 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 30 వరకు ప్రైవేట్లో 9,129 ప్రసవాలు జరిగాయి. వాటిల్లో సాధారణ కాన్పులు కేవలం 1,331 ఉండగా, సర్జరీల ద్వారా 7,798 జరగడం గమనార్హం.
భద్రాద్రి జిల్లాలో 15,573 ప్రసవాలు
భద్రాద్రి జిల్లాలో గతేడాది మే నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు 15,573 కాన్పులు జరిగాయి. అందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం 4,875 కాన్పులు మాత్రమే జరిగాయి. గతంలో వేల కాన్పులు ప్రైవేటులో జరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి.
ముహూర్తాలు వద్దు..
గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమాజంలో అనేక వినూత్న పోకడలు, వింత ఆచారాలు తెరమీదకు వచ్చాయి. వీటిల్లో భాగంగానే గర్భం దాల్చిన తల్లి ప్రసవాల కోసం పురోహితులను ఆశ్రయించడం ఒకటి. పండితులు చెప్పిన ముహుర్తాల ప్రకారం తేదీ, తిథులను పాటిస్తూ కొందరు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి కాన్పులు జరిపించుకుంటున్నారు. ఆక్రమంలో నూటికి 99 శాతం మంది ఆపరేషన్లకే మొగ్గు చూపిస్తున్నారు. ఈ తరహా పద్ధతులను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకమీదట ముహుర్తాల జోలికి వెళితే మొదట పురోహితుడిపై పోలీసు కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. సర్జరీ కాన్పులు తల్లీ, బిడ్డలకు ఎంతమాత్రం ఆరోగ్యకరం కాదని సూచిస్తున్నది.
పూర్తిగా నెలలు నిండి ప్రసవ నొప్పులు వచ్చే వరకు గర్భిణులు ఓపిక పట్టాలని కోరుతున్నది. అప్పుడే సాధారణ కాన్పు జరిగి పండంటి బిడ్డకు జన్మనిస్తారని, ఆ తర్వాత ఇరువురి జీవితం సుఖమయం అవుతుందని చెబుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల వైద్యులు సాధారణ ప్రసవాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 891 కాన్పులు నమోదవగా వాటిల్లో 371 మందికి సాధారణం జరిపించి 41.64 శాతం సగటున యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచారు. ఇక్కడి వైద్యుల పనితీరుపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.
ఇన్ని సౌకర్యాలు ప్రైవేటులోనూ ఉండవు..
ఎన్ని సౌకర్యాలు ప్రైవేటులో ఉంటే ఏంటి? అన్నింటికీ డబ్బులు కావాలి. ముందు అడ్వాన్స్ కట్టాలి. అప్పుడే బెడ్ మీద ఉంచుతారు. నొప్పులు వచ్చినా డబ్బులే వాళ్లకి ముఖ్యం. అందుకే మా అమ్మ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. వైడ్యులు నార్మల్ డెలివరీ చేశారు. రూ.40 వేలు మిగిలినట్టే. కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. రూ.12 వేలు ఖాతాలో జమ చేస్తున్నారు. అన్నీ ఉన్నాక ప్రైవేటుకు ఎందుకు వెళ్లాలి.
–మోడెం మనీషా, ఏడూళ్ల బయ్యారం,పినపాక మండలం
కేసీఆర్ కిట్ బాగా ఉపయోగపడుతోంది..
కేసీఆర్ కిట్ వల్ల ప్రసవాలు బాగా పెరిగాయి. ప్రతి గర్భిణీ స్థానికంగా అక్కడ పీహెచ్సీల వద్ద చూపించుకుని డెలివరీకి ఇక్కడకు వస్తున్నారు. ఎక్కువమందికి నార్మల్ డెలివరీ చేస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే సిజేరియన్ చేయాల్సి వస్తోంది. నెలలు నిండక ముందు వచ్చినప్పుడు గర్భిణులకు అవగాహన కల్పించి నా ర్మల్ అయ్యేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాం.
–డాక్టర్ సరళ, ఎంసీహెచ్ ఇన్చార్జి, కొత్తగూడెం
ముహూర్తాలు వద్దని చెబుతున్నాం..
చాలామంది గర్భిణులు మంచి ముహూర్తాలు చూసుకుని ఆపరేషన్లు చేయించుకున్నారు. అలాంటి పద్ధతికి స్వస్తి పలకాలని కలెక్టర్ అనుదీప్ ఇటీవల ప్రైవేటు వైద్యులు, పురోహితులతో సమీక్ష నిర్వహించారు. ప్రసవాలకు ముహూర్తాలు చూడొద్దని పురోహితులకూ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఏటా నార్మల్ డెలివరీలు పెంచుతున్నాం. ప్రైవేటులో ఆసుపత్రుల్లోనూ నార్మల్ డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకుంటాం.
–డాక్టర్ సుజాత, జిల్లా ప్రోగ్రాం అధికారి, కొత్తగూడెం