మామిళ్లగూడెం, మే 13: జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, సీతారామ ప్రాజెక్టు, రైల్వేలైన్ పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న భూసేకరణలో నిర్వాసితులకు సకాలంలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
జిల్లాలో జాతీయ రహదారులు ఖమ్మం – సూర్యాపేట, ఖమ్మం – కోదాడ, ఖమ్మం – దేవరపల్లి, ఖమ్మం – విజయవాడ, ఖమ్మం – వరంగల్, ఖమ్మం – కురవితోపాటు సీతారామ ప్రాజెక్టు, సింగరేణి, రైల్వేస్, శ్రీరామ్సాగర్ పనుల గురించి ప్రాజెక్టులు, రెవెన్యూ, సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఎస్డీసీ దశరథ, రైల్వే అధికారులు మనోజ్, ఎన్హెచ్ఏ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఈఈ యుగేందర్, మేనేజర్ దివ్య పాల్గొన్నారు.
ఉద్యోగార్థులకు సత్వరం ధ్రువపత్రాలు
టీఎస్పీఎస్సీ, పోలీస్ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు రెవెన్యూశాఖ సత్వరం కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు అందజేస్తుందని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. పత్రాల జారీలో జాప్యం జరిగితే కంట్రోల్ రూం నెంబరు 90632 11298లో సంప్రదించవచ్చని సూచించారు.