ఖమ్మం కల్చరల్, డిసెంబర్ 18: గీతాచార్యుడు శ్రీకృష్ణలీలలు అన్నీ ఇన్నీ కావు. మహిమాన్వితంగా సాక్షాత్కరించే లీలలను వీక్షించి ప్రేక్షకులు తన్మయం చెందారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శ్రీవిజయభారతి నాట్య మండలి సురభి నాటక సమాజం బాధ్యులు నిర్వహిస్తున్న నాటకోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం శ్రీకృష్ణలీలలు నాటకాన్ని ప్రదర్శించారు. భూలోకంలో హింసలు పెడుతున్న కంసుడిని వధించడానికి అవతారంగా దేవకి వసుదేవలకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించడం, రేపల్లెలో యశోద వద్ద పెరగడం, పూతనను చంపడం వంటి సన్నివేశాలు రక్తి కట్టించాయి. కాళింగ సర్పంతో పోరాడే దృశ్యం సురభి కళాకారుల సాంకేతిక నైపుణ్యానికి అద్దం పట్టింది. రేపల్లె వాతావరణం, చిలిపి కృష్ణుడి చేష్టలు, రాక్షసులను సంహరించే సన్నివేశాలు అబ్బురపర్చాయి. విష్ణువుగా నాగబాబు, నారదుడిగా శుభకర్, కంసుడు శివశంకర్, వాసుదేవుడిగా వాసురావులతోపాటు మాలిని, మానస, సాయి, భానూజలు తమ పాత్రల్లో జీవించి మెప్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో నిర్వాహకుడు సురభి ఉపేందర్, మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, బొమ్మ రాజేశ్వరరావు, సులోచన, పుతుంబాక కృష్ణప్రసాద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.