రఘునాథపాలెం, డిసెంబర్ 18: తెలంగాణ సర్కారుతో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)ది తల్లీబిడ్డల అనుబంధమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమ నేత కేసీఆర్ చేసిన పోరాటంలో టీజేఎఫ్ జర్నలిస్టుల పాత్ర గొప్పదని గుర్తుచేశారు. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఉమ్మడి ఖమ్మం జిల్లా 3వ మహాసభ ఆదివారం ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో మంత్రి అజయ్కుమార్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉద్యమ నేత కేసీఆర్తోపాటు టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ జర్నలిస్టులందరినీ ఐక్యం చేసి నడిపించిన పోరాటం మర్చిపోలేనిదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం మీడియా అకాడమీ ద్వారా జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. కరోనా సమయంలో ఈ సంక్షేమ నిధి జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఉన్న ప్రధాన సమస్య ఇళ్ల స్థలాల సమస్య అని, అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తాను రిటైర్మెంట్ తీసుకుంటూ ఈ కేసుకు పరిష్కారం చూపుతూ తీర్పునిచ్చారని గుర్తుచేశారు. దీంతో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు గ్రీన్సిగ్నల్ వచ్చినట్లయిందన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జర్నలిస్టుల సమస్యను తమ సమస్యగా భావించి పరిష్కారం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. త్వరలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశమై పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తన నియోజకవర్గంలోని జర్నలిస్టులందరికీ త్వరలోనే ఇండ్లు, ఇళ్ల స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 100 డబుల్ బెడ్రూం ఇండ్లు, మరో 100 ఇళ్ల స్థలాలు సిద్ధం చేసి ఉంచామన్నారు. త్వరలో మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనను ఖరారు చేసుకొని రాష్ట్ర అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎంపీ వద్దిరాజు సమక్షంలో నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను నూతన సంవత్సర కానుకగా అందజేస్తామని మాట ఇచ్చారు. మొదట తాను ఇస్తానని, మిగిలిన నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను కలుపుకొని ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడానికి కృషి చేస్తానని అన్నారు.
ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అమోఘం: వద్దిరాజు, తాతా మధు
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఆమోఘమైందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఉ ద్యమ సమయంలో టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది జర్నలిస్టులు కదిలి ఉద్యమ నేత కేసీఆర్తో కలిసి కదం తొక్కారని గుర్తుచేశారు. మంత్రి సహకారంతో ఇండ్ల స్థలాలకు కృషి చేస్తామన్నారు. ఖమ్మం ప్రెస్క్లబ్ భవన నిర్మా ణానికి మంత్రి అజయ్, ఎంపీ నామా, రాజ్యసభ సభ్యు డు వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు తలా రూ.10 లక్షల చొప్పున రూ.40 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఇళ్ల స్థలాల సాధనే ఏకైక ఎజెండా:అల్లం నారాయణ
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల ఏకైక సమస్య ఇళ్ల స్థలాలదేనని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దానిని సాధించుకోవడమేనని తమ ఏకైక ఎజెండా అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న ఏకైక జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) అని పేర్కొన్నారు. 2001లో టీజేఎఫ్ ఏర్పడిన తరువాత తెలంగాణ ఉద్యమానికి మూలచుక్కగా నిలిచిందని గుర్తుచేశారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అస్కాని మారుతిసాగర్, రమేశ్ హజారి, సయ్యద్ ఇస్మాయిల్, రమణకుమార్, మేకల కల్యాణ్ చక్రవర్తి, పునకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, లక్ష్మీప్రసన్న, పగడాల నాగరాజు, పోటు రంగారావు, నున్నా నాగేశ్వరరావు, ఇస్మాయిల్, వెన్నబోయిన సాంబశివరావు, బొల్లం శ్రీనివాస్, చిర్రా రవి, అడపాల నాగేందర్, రాఘవ, కొల్లోజు శ్రీనివాస్, గుద్దేటి రమేశ్బాబు, బీ.కృష్ణ, జగదీశ్, కిరణ్ పాల్గొన్నారు.
జిల్లా నూతన కమిటీ ఎన్నిక
టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) నూతన కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆకుతోట ఆదినారాయణ మరోసారి ఎన్నికయ్యారు. కార్యదర్శిగా చిర్రా రవి, ఉపాధ్యక్షులుగా బొల్లం శ్రీనివాస్, వెన్నబోయిన సాంబశివరావు, ప్రశాంత్రెడ్డి, కోశాధికారిగా తోట సంపత్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా రజనీకాంత్ ఎన్నికయ్యారు.