సత్తుపల్లి, డిసెంబర్ 16 : ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ.గౌతమ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పట్టణ, మండలంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాతసెంటర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో అభివృద్ధి పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో పనుల ప్రగతిని సమీక్షించారు. బేతుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల పురోగతిపై విద్యార్థులతో ముచ్చటించి వారి ప్రగతిపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణశివారులో నిరుపేద కుటుంబాల కోసం ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తిచేయాలన్నారు. సత్తుపల్లిలో రూ.35 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సుభాషిణి, ఆర్అండ్బీ ఈఈ హేమలత, కమిషనర్ సుజాత, ఎంఈవో రాములు, సీడీపీవో కొండమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిశీలన
సత్తుపల్లిలోని బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ఎమ్మెల్యే సండ్ర , కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం పరిశీలించి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ రేకుల షెడ్డులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిస్థితిని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా భవన నిర్మాణానికి హామీ ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. వారి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.