ఇల్లెందు రూరల్, డిసెంబర్ 12;ఇల్లెందు పట్టణం మూడు జిల్లాల కేంద్రాలకు కేంద్ర బిందువు. ఐదు మండలాల ప్రజలకు పెద్దదిక్కు. అయితే నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకోవడం చాలా కష్టంగా ఉండేది.. ఇతర పట్టణాలు, నగరాలకు తరలివెళ్లేవారు. కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి డబ్బులు గుల్ల చేసుకునేవారు. కిడ్నీ బాధితుల సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ డయాలసిస్ కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఐదు మండలాల్లో కిడ్నీ బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ ఇల్లెందులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్రావుకు వినతిపత్రం అందజేశారు. కేంద్రం లేకపోవడంతో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను ఆయనకు వివరించారు.
ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలను వైద్యవిధాన పరిషత్(వీవీపీ)లోకి తెచ్చి నియోజకవర్గ ప్రజలకు డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే ఎంతగానో కృషి చేశారు. ఎమ్మెల్యే విన్నపాన్ని పరిశీలించిన మంత్రి ఇల్లెందులో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేశారు. మరికొద్దిరోజుల్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకానున్న సమాచారం విన్న నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు చెబుతున్నారు. ఎమ్మెల్యే సొంతంగా రూ.20 లక్షలను ఆసుపత్రి భవన మరమ్మతుల కోసం కేటాయించగా, కలెక్టర్ అనుదీప్ రూ.15 లక్షలు ఆపరేషన్ థియేటర్కు కేటాయించారు.
త్వరలో డయాలసిస్ సెంటర్
నియోజకవర్గంలోని కిడ్నీ బాధితుల కష్టాలు తీరనున్నాయి. త్వరలోనే ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేం ద్రం ఏర్పాటు కాబోతుంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులు ఇల్లెందుకు డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇబ్బంది ఉండదు. ఇతర ప్రాంతాలకు వెళ్లే అవస్థలు తప్పాయి. రోగులు ఇక మీదట ఇక్కడే డయాలసిస్ చికిత్స పొందవచ్చు.
నూతన పరికరాలు సిద్ధం
ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యవిధాన పరిషత్లోకి వచ్చిన తరువాత రోగులకు చికిత్స అందించేందుకు నూతన పరికరాలను జిల్లా యంత్రాంగం సిద్ధం చేస్తున్నది. ఛాతినొప్పి, దగ్గు, ఆయాసం వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించేందుకు ఎక్స్రే మిషన్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గర్భిణులు టిఫా స్కానింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి డబ్బులను ఖర్చు చేసుకునేవారు. వీరి ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారులతో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు స్కానింగ్ చేయించుకునేందుకు టిఫా స్కానింగ్ను ఏర్పాటు చేశారు. రోగులకు సరిపోయే బెడ్లను కూడా సిద్ధం చేశారు. రక్తపరీక్షలు, సెల్కౌంటింగ్ తదితర పరీక్షల కోసం పరికరాలను సిద్ధం చేశారు. ఆసుపత్రికి ఇప్పటికే నలుగురు ఎంబీబీఎస్ డాక్టర్లు, ఏడుగురు స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉన్నారు. ల్యాబ్ టెక్నిషియన్, సరిపడా ఫార్మాసిస్టు సిబ్బంది నియామకాలు పూర్తికావచ్చాయి. దీంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం మానేశారు. సకల సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు ప్రతిరోజూ బారులు తీరుతున్నారు. ఔట్పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
ప్రైవేట్లో డయాలసిస్ చేయించుకునేందుకు నాకు స్తోమత లేదు. రవాణా ఖర్చులు సైతం మోయలేకపోతున్నాను. ఎమ్మెల్యే హరిప్రియానాయక్ చొరవతో ఇల్లెందులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కావడం నిజంగా మా అదృష్టం. సీఎం కేసీఆర్ సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు. మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే హరిప్రియకు రుణపడి ఉంటాం.
– బర్ల జానకమ్మ, కిడ్నీ బాధితురాలు, ఇల్లెందు
కిడ్నీ బాధితులకు పెద్దవరం
కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇల్లెందులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పెద్ద వరం. ఇతర ప్రాంతాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేయించుకోవాల్సిన అవస్థలు త్వరలో తీరనున్నాయి. ఐదు మండలాల ప్రజలకు తీపికబురు అందింది. వ్యయప్రయాసాలకోర్చి డయాలసిస్ చేయించుకునే వారిని తీసుకెళ్లే బంధుమిత్రుల ఇబ్బందులు కూడా తొలగనున్నాయి.
– డాక్టర్ రవిబాబు, డీసీహెచ్ఎస్, కొత్తగూడెం