భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 1, 2 తేదీల్లో భద్రాచలంలో ముక్కోటి ఉత్సవం ప్రశాంత వాతావరణంలో వైభవంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ముక్కోటి ఏకాదశి మహోత్సవాలపై కొత్తగూడెంలోని కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికారులందరూ తమకు నిర్దేశించిన పనులకు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని, భక్తుల ఫిర్యాదులు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రోహిత్రాజ్, జడ్పీ సీఈవో విద్యాలత, దేవస్థానం ఈవో శివాజి, డీఆర్డీవో మధుసూదన్రాజు, డీపీవో రమాకాంత్, డీసీవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో దయానందస్వామి, డీఆర్వో అశోక్చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
‘మన బడి’ నివేదికలు అందించాలి
‘మన ఊరు – మన బడి’లో గుర్తించిన అంశాలపై ప్రత్యేక అధికారులు నివేదికలు అందజేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులతో సోమవారం సమీక్షించిన ఆయన.. శుక్రవారం నాటికి ‘మన బడి’ పనుల ప్రగతిని పర్యవేక్షించి నివేదికలు అందజేయాలని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయిన చోట వాటిని లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు.
ప్రభుత్వ విప్, కలెక్టర్కు ఆహ్వానం..
మణుగూరు టౌన్, డిసెంబర్ 12: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు, వచ్చే నెల 1, 2 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు హాజరుకావాలంటూ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు దేవస్థానం ఈవో శివాజీ ఆహ్వాన పత్రం అందజేశారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయనను కలిసి ఆహ్వానపత్రం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే కొత్తగూడెంలో కలెక్టర్ అనుదీప్ను కలిసి ఆయనకు కూడా ముక్కోటి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు.