మధిర టౌన్, డిసెంబర్12: వైద్యం వికటించి తమ కూతురు కంటి చూపు పోయిందని పట్టణంలోని ఆర్వోబీ సమీపంలో రమేశ్ కంటి ఆస్పత్రి ఎదుట బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేసిన ఘటన సోమవారం చోటు చేసుకున్నది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రుపాలెం మండలం కాచారం గ్రామానికి చెందిన బ్రహ్మజీ, సైదమ్మ కుమార్తె షర్మిల (12) ఈ నెల 8వ తేదీన కంటిలో నలుసు పడింది. మధిరలోని రమేశ్ కంటి ఆస్పత్రికి తీసుకొచ్చి చూయించారు. వైద్యుడు కంటి వద్ద ఇంజక్షన్ చేసి తిరిగి రెండు రోజుల తర్వాత రావాలని సూచించారు. రెండురోజుల తర్వాత వారు రావడంతో మళ్లి ఇంజక్షన్ చేసి పంపాడు. పాప కంటి చూపులో మార్పు రాలేదని సోమవారం తల్లిదండ్రులు ఆస్పత్రి వచ్చి డాక్టర్ అడగ్గా నాకు వచ్చిన వైద్యం ఇదేనంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి హైదరాబాద్ వెళ్లి కంటి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పాడు. భయాందోళన చెంది ఆస్పత్రి ఎదుట వారు బంధువులతో కుర్చొని ఆందోళన చేసట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై సతీశ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని బాలిక తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడి ఆందోళన విరమింప చేశారు. అనంతరం వైద్యుడు రమేశ్ బాలిక కంటి చూపు ఆపరేషన్కు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని తల్లిదండ్రులకు, బంధువులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.