దమ్మపేట, డిసెంబర్ 6: ‘నేను నాగలి దున్నే కుటుంబం నుంచి వచ్చా& నాడు రైతుల బాధలను చూసి చలించిపోయా. రాజకీయంలోకి వచ్చి నా వంతుగా రైతులకు సేవ చేయాలనుకున్నా. అదే తలంపుతో రైతు బాధలను పోగొట్టేందుకు ప్రయత్నించా. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఆయన చూపిన బాటలో వరితో పాటు ఆయిల్ పాం, వక్క, మిరియం, పుచ్చకాయ, కోకో పంటలు సాగు చేస్తున్నాను. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఆయిల్ పాం సాగు చేస్తున్న రైతులు ఆర్థికంగా బలపడ్డారు. మంత్రిగా పనిచేసినప్పుడు రైతులకు తాగునీరు, సాగునీటి సదుపాయంతో పాటు విద్యుత్, రహదారుల సౌకర్యం కల్పించాను. స్వరాష్ట్రం వచ్చాక రైతుల ప్రోత్సహిస్తున్నాను. ఇప్పుడు వ్యవసాయ రంగం లాభసాటిగా మారింది.
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు సాధించవచ్చు’ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి జిల్లా రైతులు సాధిస్తున్న విజయాలను గమనించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తన సొంత జిల్లా అయిన సిద్దిపేట రైతులను ఆయిల్పాం సాగుకు ప్రోత్సహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆ జిల్లాలోని కోహెడ, బెజ్జంకి, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు చెందిన 80 మంది రైతులు మంగళవారం దమ్మపేట మండలంలోని దురదపాడుకు విచ్చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. మాజీ మంత్రి తన వ్యవసాయ క్షేత్రంలో వారితో కలిసి కలియదిరిగి ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించారు. అంతర పంటలుగా సాగు చేస్తున్న పుచ్చకాయ, వక్క, మిరియం, కో కో పంటలను రైతులకు చూపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన పంటలే కాక ప్రత్యామ్నాయ పంటలనూ సాగు చేయాలని సూచిస్తున్నారని తుమ్మల అన్నారు. ఈ పిలుపుతో తన వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నానన్నారు. దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు చెందిన రైతులు ప్రభుత్వ ప్రోత్సహకాలు అందిపుచ్చుకుంటున్నారన్నారు. మంచి ఫలసాయాన్ని పొందుతున్నారన్నారు. ఇక్కడి ఆయిల్ పాం తోటలను కేరళ, కర్నాటక, తమిళనాడుతో పాటు దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, రైతులు పరిశీలించారన్నారు. తెలంగాణ ఆయిల్పాం సాగులో దూసుకుపోతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్తో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నదన్నారు. ఇప్పటికే ఆయిల్ పాం సాగులో దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇక్కడి రైతులు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఆలంబనగా చేసుకుని మంది ఆదాయాన్ని గడిస్తున్నారన్నారు. తాను 25 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేస్తున్నానన్నారు. అనంతరం రైతులు అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు.
కోనసీమను తలపిస్తున్నది..
దమ్మపేట మండలం ఆయిల్పాం తోటలతో ఆహ్లాదకరంగా ఉంది. ఆంధ్రాలోని కోనసీమను తలపిస్తున్నది. పాం సాగుపై మాజీ మంత్రి తుమ్మల చక్కగా అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రాల్లో అంతర పంటలను చూసి ఆశ్చర్యపోయాం. అంతరపంటలతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిసింది. – బాపాలి ముకుందరెడ్డి, ఎంపీటీసీ, కొయిడ, సిద్ధిపేట జిల్లా
ఆయిల్పాం సాగుపై దృష్టి..
ఆయిల్పాం సాగులో భద్రాద్రి జిల్లా రైతులు ఆదర్శంగా నిలుస్తు న్నారు. సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. సాగు గురించి తెలుసుకోవడానికి దమ్మపేట మండలానికి వచ్చాం. తోటల సాగుపై మాకు ఆసక్తి పెరిగింది. ఇక నుంచి మా ప్రాంతంలోనూఏ ఆయిల్పాం సాగు చేస్తాం. సిద్దిపేట జిల్లాలోనూ ఫ్యాక్టరీ ఏర్పాటైతే మాకు ఇబ్బందులు ఉండవు.
– జెట్టి అర్జున్, రైతు, బెజ్జంకి, సిద్దిపేట జిల్లా