మామిళ్లగూడెం, డిసెంబర్ 6 : సేవలో తానా ఎప్పుడు ముందువరుసలో ఉంటుందని తానా చైర్మన్ అంజయ్య చౌదరి లావు అన్నారు. మంగళవారం స్థానిక కేఎల్సీలో తానా ఫౌండేషన్, తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో పరికరాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో అనేక మంది విద్యార్థులు, దివ్యాంగులు, అనాథలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో చదువులో రాణిస్తున్న పేద విద్యార్థులకు తానా ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. తాళ్లూరి పంచాక్షరయ్య ఫౌండేషన్ ద్వారా అన్నం ఫౌండేషన్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.7 లక్షల చెక్కును అందించారు.
సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు చక్రాల బ్యాటరీ వాహనాన్ని అందించారు. 30మంది బాలికలకు సైకిళ్లు, 15మంది విద్యార్థులకు ల్యాప్ట్యాప్స్, తిరుమలాయపాలెం కేజీబీవీ పాఠశాలకు స్మార్ట్ టీవీ అందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుభాష్చంద్రబోస్, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, తానా సభ్యులు నిరంజన్ శృంగవరపు, రవి సామినేని, సతీశ్ వేమూరి, విశ్వనాథ్, సామినేని నాగేశ్వరరావు, జిల్లా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ బండి నాగేశ్వరరావు, శ్రీనివాస్, కృష్ణారావు, సునీత, ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ సుధారాణి పాల్గొన్నారు.