ఖమ్మం, డిసెంబర్ 3: దేశంలో మతోన్మాద బీజేపీ విధానాలను ఎదుర్కొనే లక్ష్యంతో లౌకికవాద ప్రజాతంత్ర శక్తులతో కలిసి పనిచేస్తామని, తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కూడా తమకు ఇదే విషయాన్ని ఆదేశించారని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఆ క్రమంలోనే జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు, ఇతర లౌకిక శక్తులతో కలిసి తమ పార్టీ పనిచేస్తున్నదని అన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అశాంతిని నెలకొల్పడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని, మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల మధ్య అంతరాలు పెంచుతూ పబ్బం గడుపుతున్నదని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చుతున్నదని, తెలంగాణలోనూ దొంగస్వాముల ద్వారా ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నం చేసి దొరికిపోయిందని దుయ్యబట్టారు.
ఆ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికే ఢిల్లీ మద్యం పాలసీ కేసును తీసుకొచ్చి ఎంపీ కవితకు నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై ఈడీ, సీబీఐ, ఐటీ దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్ఎస్ నాయకులు భయపడబోరని స్పష్టం చేశారు. బీజేపీ వదిలిన బాణం వైఎస్ షర్మిల తెలంగాణ సీఎం, ఎమ్మెల్యేలు, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల మద్దతు ముఖ్యమంత్రి కేసీఆర్కే ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పాలేరు నాయకులు, ప్రజాప్రతినిధులు బెల్లం వేణు, యండవల్లి వరప్రసాద్, బెల్లం ఉమ, బానోత్ శ్రీను, మంగీలాల్, ఇంటూరి శేఖర్, అక్కినపల్లి వెంకన్న, కొప్పుల ఆంజనేయులు, మట్టా వెంకటేశ్వరరావు, గద్దె సతీశ్, దర్గయ్య, పేరం వెంకటేశ్వర్లు, వెంపటి రవి, రమేశ్, ముత్యం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.