మామిళ్లగూడెం,డిసెంబర్ 3: దళితబంధు యూనిట్లకు వందశాతం గ్రౌండింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో శనివారం దళితబంధుపై నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 483 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటికే 475 యూనిట్లకు గ్రౌండింగ్ పూర్తయిందన్నారు. పైలట్ ప్రాజెక్ట్గా ఎంపికైన చింతకాని మండలానికి 3,462 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటివరకు 2,717 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. అధికారులు మిగిలిన వాటికీ గ్రౌండింగ్ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలన్నారు. యూనిట్ల మార్పునకు అవకాశం లేదన్నారు. మొదటి యూనిట్ నిర్వహణపై పూర్తి నమ్మకం ఏర్పడ్డాక రెండో విడత మంజూరుపై దృష్టి సారించాలన్నారు. పశు సంవర్ధకశాఖ పశువులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలతా మొగిలి, జడ్పీ సీఈవో అప్పారావు, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ శ్రీనివాసరావు, జిల్లా రవాణాధికారి కిషన్రావు, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారిణి సరిత, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరాం, జిల్లా పశుసంవర్ధక అధికారి వేణు మనోహర్, డీఆర్డీవో విద్యాచందన, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, జీఎం ఇండస్ట్రీస్ అజయ్కుమార్, చింతకాని ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.