భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, బూర్గంపహాడ్, నవంబర్ 25: కొత్త ఓటర్ల నమోదు కోసం కాలేజీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కొత్తగూడెం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరితోనూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఈ నెల 26, 27, వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద క్యాంపులు నిర్వహించి నమోదు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో 1,092 పోలింగ్ కేంద్రాల పరిధిలో 8,98,409 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 729 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని అన్నారు. గత డిసెంబర్ 12 నుంచి ఈ సెప్టెంబర్ 30 వరకు ఫారం 6 దరఖాస్తులు 8,415 వచ్చాయన్నారు. వాటిలో 6,894 దరఖాస్తులను పరిష్కరించి, 1,521 దరఖాస్తులను తిరస్కరించినట్లు చెప్పారు. ఫారం 7 కోసం 16,522 దరఖాస్తులు రాగా వాటిల్లో 16,065 దరఖాస్తులను పరిష్కరించి 457 దరఖాస్తులను తిరస్కరించామని, ఫారం 8కి 2,670 దరఖాస్తులు రాగా వాటిల్లో 2,130 దరఖాస్తులను పరిష్కరించి, 540 దరఖాస్తులను తిరస్కరించామని వివరించారు. జిల్లాలో 25,242 ఎపిక్ కార్డులు జారీ చేయాల్సి ఉందన్నారు. వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉంటుందన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, నూతన ఓటర్ల నమోదు ప్రక్రియతోపాటు చేర్పులు, మార్పుల ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని అన్నారు. జాయింట్ సీఈవో రవికిరణ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు గౌతం, వెంకటేశ్వర్లు, స్వర్ణలత, రత్నకల్యాణి, విజయకుమారి, స్వీప్ నోడల్ అధికారి మధుసూదనరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తప్పులు లేని జాబితా రూపొందించాలి..
తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యత ఎంతో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ పేర్కొన్నారు. భద్రాచలంలోని నన్నపనేని మోహన్ పాఠశాల, బూర్గంపహాడ్ మండలం ఎంపీ బంజర పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియ దరఖాస్తులను రిజిస్టర్లో నమోదు చేసి భద్రపరచాలని సూచించారు. మరణించిన వారి ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని సూచించారు. 17 ఏళ్లు దాటిన వారు కూడా భవిష్యత్తు ఓటర్లుగా నమోదు కావడానికి ఆన్లైన్/ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఓటు హక్కు ఆవశ్యకతపై బంజర పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. తహసీల్దార్లు శ్రీనివాస్యాదవ్, భగవాన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామయ్య సన్నధిలో సీఈవో..
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకొని అంతరాలయంలోని మూలవరుల వద్ద ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.