జిల్లాను వణికిస్తున్న చలిపులి
చలి చంపేస్తోంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటిగాలులు వీస్తున్నాయి. మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సోమవారం చిరు జల్లులు కురవడం, చల్లని గాలులు వీయడంతో చలి తీవ్రత పెరిగింది. రోజంతా సూర్యుడి జాడ లేనే లేదు. ఉదయం 9 గంటల వరకు ఒకవైపు మంచు బిందువులు, మరోవైపు చిరుజల్లులు కురిశాయి. మధ్యాహ్నం తరువాత తేలికపాటి జల్లులతో కూడిన వర్షం కురిసింది. కాగా, చలి తీవ్రం కావడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు కలిగినవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఉన్ని దుస్తులను వినియోగిస్తున్నారు. – ఖమ్మం, నవంబర్ 21
ఖమ్మం, నవంబర్ 21: చలి పంజా విసురుతోంది. ప్రారంభంలోనే ప్రతాపాన్ని చూపిస్తోంది. మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. వాతావరణం కూడా చల్లబడుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటిగాలులు వీస్తున్నాయి. సోమవారం రోజంతా చిరు జల్లులు కురవడం, చల్లని గాలులు వీయడంతో చలి తీవ్రత పెరిగింది. చలి పెరగడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్నారులు చలికి వణుకుతూ బయలుదేరుతున్నారు. నగరంలో మార్నింగ్ వాక్ చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
తెల్లవారుజామునే పాలు, కూరగాయలు విక్రయించే వారు రక్షణ కవచాలు ధరించి కూడా వణుకుతూనే నగరానికి వస్తున్నారు. ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి, అశ్వారావుపేట. మధిర, వైరా, కూసుమంచి ప్రాంతాల్లో చలి కాస్తంత ఎక్కువగా ఉంటోంది. చలి తీవ్రత మరింత పెరగడంతో ఉన్ని దుస్తులకు డిమాండ్ పెరిగింది. ఖమ్మం నగరంలో టిబెట్ వాసులు నెలకొల్పిన ఉన్ని దుస్తుల దుకాణాల్లో విక్రయాలు పెరిగాయి. స్వెర్టర్లు, మఫ్లర్లు, టోపీలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చలికారణంతో దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు ఇబ్బంది పడుతూ ఆసుపత్రులకు వెళ్తున్నారు.
విద్యార్థులు, ఉద్యోగుల అవస్థలు..
భారీ వర్షం కురిసినా, పిడుగులు పడినా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు, ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సిందే. ప్రస్తుతం జిల్లాపై చలిపులి పంజా విసురుతుండడంతో ఉదయాన్నే పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు, విధులకు వెళ్తున్న ఉద్యోగులకు అవస్థలు తప్పడం లేదు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఉద్యోగులు గజగజ వణుకుతూనే పరుగులు పెడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు కూడా చలికి వణుకుతూనే కూలి పనులకు వెళ్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు కలిగిన రోగులు జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. చిన్నారులకు చలిగాలి తగలకుండా చర్యలు తీసుకోవాలి. ఎండ వచ్చిన తర్వాతే బయటకు రావాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే చలిగాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 8 గంటలకు ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత దూర ప్రయాణాలను రద్దు చేసుకుంటేనే మేలు.
రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించొద్దు. రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయకపోవడమే మేలు. చలి తీవ్రత తగ్గే వరకూ నూలుతో తయారు చేసిన వస్ర్తాలనే ధరించాలి. చిన్న పిల్లల చేతులకు, కాళ్లకు గ్లౌజులు వేస్తే మరీ మంచిది. చలి ఎక్కువగా ఉన్న సమయంలో చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వకూడదు. చలికి కాళ్లు, చేతులకు పగుళ్లు రాకుండా వాజిలిన్ వాడడం ఉత్తమం.
జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు
ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 21: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం సోమవారం జిల్లాపై పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. సూర్యుడి జాడ లేనే లేదు. నగర శివారులో ఉదయం 9 గంటల వరకు ఒకవైపు మంచు బిందువులు, మరోవైపు చిరుజల్లులు కురిశాయి. మధ్యాహ్నం తరువాత నగరంలో తేలికపాటి జల్లులతో కూడిన వర్షం కురిసింది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు పంటను తీసుకొచ్చిన రైతులు కొంత ఆందోళనకు గురయ్యారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సత్వరమే స్పందించి వెనువెంటనే కాంటాలు, తోలకాల ప్రక్రియను పర్యవేక్షించారు. పంటను కాపాడుకునేందు కోసం రైతులకు స్వయంగా టార్పాలిన్లు అందజేశారు. పత్తి, మిర్చి పంటలు చేతికి వచ్చే సమయంలో మారోమారు వర్షాలు వచ్చే అవకాశం కన్పిస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.