ఇదీ ముక్కోటి ముఖచిత్రం..
డిసెంబర్ 1 : ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా టికెట్ల విక్రయాల ప్రారంభం
డిసెంబర్ 26 : విధుల్లోకి అధికారులు
జనవరి 1 : తెప్పోత్సవం.
జనవరి 2 :ఉత్తర ద్వార దర్శనం
మరుగుదొడ్లు : 200 (తాత్కాలిక)
పార్కింగ్ స్థలాలు : బ్రిడ్జి పక్కన, కాలేజీ స్టేడియం, మార్కెట్ యార్డు
కంట్రోట్ రూములు : కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం సబ్ కలెక్టరేట్
సమాచార అధికారి : శీలం శ్రీనివాసరావు, డీపీఆర్వో
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : భద్రగిరిలో భక్త కోటి కనులారా తిలకించే ముక్కోటి ఉత్సవాలను ఈ సారి వైభవోపేతంగా జరిపించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. శ్రీరామనమమి ఉత్సవాలను విజయవంతం చేసినట్లుగానే ముక్కోటి ఉత్సవాలనూ సక్సెస్ చేసేందుకు భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే శనివారం జిల్లాలో అన్ని శాఖల అధికారులతో ముక్కోటి ఉత్సవంపై ప్రత్యేకంగా సమీక్షించారు. కరోనా తర్వాత తొలిసారిగా భక్తులను అనుమతించేలా ముక్కోటి ఏర్పాట్లు చేస్తున్నారు.
పక్కా ప్రణాళికతో..
ముక్కోటి ఉత్సవాన్ని భక్తుల జనసందోహం నడుమ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. డిసెంబర్ 1 నుంచే ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దర్శనం టికెట్ల విక్రయాలను ప్రారంభించనున్నారు. జనవరి 1 తెప్పోత్సవం, 2న వైకుంఠకాదశి, ఉత్తర ద్వార దర్శనం. గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు సమస్యలు తలెత్తకుండా బారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. గోదావరి వంతెన పక్కన, కాలేజీ మైదానం వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు.
పట్టణమంతా పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఇప్పటికే కలెక్టర్ ఆదేశించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భద్రాచలం ఆర్డీవోకు దిశానిర్దేశం చేశారు. గత ఉత్సవాల అనుభవం దృష్ట్యా పారిశుధ్య పనుల నిర్వహణపై డీపీవో రమాకాంత్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రూట్ మ్యాపుల బాధ్యతను డీపీఆర్వో శీలం శ్రీనివాసరావుకు అప్పగించారు. వైద్య సేవల కోసం ఆ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
కంట్రోల్ రూములు..
గతంలో నదిలో నీరు లేకపోవడం, కరోనా వల్ల పూజా కార్యక్రమాలు ఆలయం వరకే పరిమితమయ్యాయి. కానీ ఈ సారి తెప్పోత్సవంలో స్వామివారు హంస వాహనంపై విహరించేందుకు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేసేలా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు చేశారు. ఎక్కడ సమస్యలు ఎదురైనా పరిష్కరించేలా కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం సబ్ కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. లాంచీపైకి వీఐపీలు పరిమిత సంఖ్యలోనే ఎక్కేలా చర్యలు తీసుకోనున్నారు. కరకట్ట సుందరీకరణతోపాటు విద్యుదీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ముక్కోటి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం..
రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య ముక్కోటి ఉత్సవం వైభవంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయబోతున్నాం. శ్రీరామనవమిని కూడా టీం వర్క్తో పక్కాగా నిర్వహించుకొని సక్సెస్ అయ్యాం. ముక్కోటి ఉత్సవాన్ని కూడా ఇదే తరహాలో జరుపుతాం. ప్రతి ఒక్కరికీ రామయ్య దర్శనం లభిస్తుంది. ప్రసాదాల వద్ద ఇబ్బందులు లేకుండా కౌంటర్లు పెంచుతున్నాం.
-అనుదీప్, భద్రాద్రి కలెక్టర్