బూర్గంపహాడ్, నవంబర్ 24: బూర్గంపహాడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో ఇక నుంచి రోజలంతా నిరంతరాయంగా వైద్య సేవలు అందుతాయని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ఈ సెంటర్ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం, ఆసుపత్రిలోని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ) సెంటర్ను ప్రారంభించారు.ఆ తర్వాత, విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఆస్పత్రిలో గతంలో ఇద్దరు వైద్యులు ఉండేవారని, ఇటీవల మరో ఐదుగురు వచ్చారని చెప్పారు. మొత్తం ఏడుగురు వైద్యులతో నిరంతరాయంగా వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు.
‘ఆరోగ్య తెలంగాణ’ సాధించే దిశగా ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. బూర్గంపహాడ్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేస్తామని, అన్ని రకాల ఆపరేషన్లు జరిగేలా చూస్తామని అన్నారు. ఆస్పత్రిలో సమకూర్చాల్సిన మౌలిక వసతులకు సంబంధించిన వివరాలను సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ నుంచి తెలుసుకున్నట్లు చెప్పారు.
రోగులకు సరిపడినన్ని బెడ్లు లేవని చెప్పారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని, ఆస్పత్రిని ఆధునీకరిస్తామని అన్నారు. ఓపీ గది, త్రీ ఫేజ్ కరెంటు, ఆపరేషన్ థియేటర్లో ఏసీ ఏర్పాటుకు నిధులు ఇచ్చేందుకు ఎమ్మెల్యే రేగా కాంతారావు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రోగులకు మంచి భోజనం అందించాలని, పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ను నియమించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబును కోరారు. సర్పంచ్ సిరిపురం స్వప్న, తహసీల్దార్ భగవాన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.