ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, నవంబర్ 11: పోడు భూముల సర్వే, గ్రామ, డివిజన్, జిల్లా సభలను ఈ నెల ఆఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. పోడు భూముల సర్వే, ధరణి దరఖాస్తులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోడు భూముల సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి దరఖాస్తునూ క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎకడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రజల సందేహాలు నివృత్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన వారికి డిసెంబర్ మొదటి వారంలో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినందున ఈ నెల ఆఖరులోగా పోడు భూముల సర్వే, గ్రామ, డివిజన్, జిల్లా స్థాయి సభల నిర్వహణ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన అటవీ భూముల ఆక్రమణకు అనుమతించరాదని, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
భవిష్యత్తులో అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా గ్రామసభల్లో తీర్మానించాలని తెలిపారు. నిర్దేశిత లక్ష్యం మేరకు భూ సర్వే పనులు, గ్రామసభలు పూర్తి కావాలన్నారు. అనంతరం పోడు భూముల సర్వే పురోగతిపై సీఎస్ సోమేశ్కుమార్ జిల్లాల వారీగా రివ్యూ చేశారు. ధరణి పోర్టల్ 33 మాడ్యూళ్లలో పెండింగ్ దరఖాస్తుల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షించారు. ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిషరించాలని కలెక్టర్లను ఆదేశించారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ 2007ను అమలు చేయాలన్నారు. ఈ యాక్ట్ను అనుసరించి వచ్చిన అర్జీలను నిర్ణీత కాలంలోగా పరిషరించాలన్నారు.
హైదరాబాద్ నుంచి ఈ వీసీలో పాల్గొన్న ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సమాధానమిస్తూ.. ఖమ్మం జిల్లాలో 42,409.11 ఎకరాల్లో హక్కుల కోసం 18,295 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిల్లో ఇప్పటి వరకు 2,398 దరఖాస్తులను పరిశీలించినట్లు తెలిపారు. ఈ నెల 20 నాటికి సర్వేను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల అధికారులతో పోడుదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నూతన అటవీ ఆక్రమణలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఖమ్మం నుంచి అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఎఫ్వో సిద్ధార్థ విక్రమ్సింగ్, అదనపు డీసీపీ శబరీశ్, డీపీవో హరిప్రసాద్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కృష్ణనాయక్, ఆర్డీవో సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.