నీటిమూటలు.. రాష్ట్ర విభజన హామీలు
ఖమ్మం, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ పరిధిలోని ఏడు మండలాలను పోలవరం ముంపు మండలాల పేరుతో కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపింది. అంతేకాదు భద్రాచలం పట్టణానికి సమీపంలోని నాలుగు పంచాయతీలనూ ఏపీలో విలీనం చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు. చట్టంలోని 13వ క్లాజ్లో అప్పటి ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో రూ.30 వేల కోట్ల వ్యయంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.
ఎనిమిదేళ్లు దాటినా కేంద్రం ఇప్పటివరకు దాని ఊసే పట్టించుకోవడం లేదు. సర్వేలు, జాయింట్ సర్వేల పేరుతో కాలయాపన తప్ప ఫ్యాక్టరీ విషయం ఒక్క అడుగు ముందుకు కదలలేదు. ప్రభుత్వ రంగ సంస్థ అందుబాటులోకి వస్తే వేలాది మంది బంజారా, ఆదివాసీ, గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందని ఆశిస్తే కేవలం నిరాశే మిగులుతున్నది. గిరిజన యూనివర్సిటీ, కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటు హామీలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఏటా కేంద్ర బడ్జెట్ విడుదలైనప్పుడల్లా ఉమ్మడి జిల్లాప్రజలు ఉక్కు ఫ్యాక్టరీ, విమానాశ్రయం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన వస్తుందని ఆశించి భంగపాటుకు గురవుతున్నారు.
బయ్యారంలోనే అధిక నిల్వలు..
దేశవ్యాప్తంగా ఉన్న ఇనుప ఖనిజ నిల్వల్లో 12శాతం బయ్యారంలోనే ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే నిర్ధారించింది. ఇప్పటి ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, కరీంనగర్లో భీమదేవరపల్లిలో లభించే ఐరన్ కంటే మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో లభించే ఖనిజమే నాణ్యమైనదని అధ్యయనం తేల్చింది. మిగిలిన ప్రాంతాల్లో కంటే 80శాతం నిక్షేపాలు బయ్యారం ప్రాంతంలోనే ఉన్నాయని నివేదిక పేర్కొన్నది. ఇక్కడ లభించే ఖనిజంలో నాణ్యత 45 ప్లస్ ఉంటుందని ఎంతోమంది మైనింగ్ నిపుణులు వెల్లడించారు. బయ్యారం రిజర్వ్ ఫారెస్ట్లో సుమారు 800 మిలియన్ టన్నులకు పైగా ఖనిజ నిల్వలు ఉన్నాయని 2008లో ఓ అధ్యయన సంస్థ అంచనా వేసింది.
ఈ ఖనిజం వెలికి తీయడానికి సుమారు రెండు దశాబ్దాలు పడుతుందని నివేదికలో పేర్కొన్నది. బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి కోరినప్పటికీ పట్టించుకున్న పాపానపోలేదు. ఫ్యాక్టరీ నిర్మిస్తే తవ్వి తీసిన ఖనిజాన్ని రైలు మార్గం ద్వారా తరలించాల్సి ఉంటుంది. రైలు మార్గం ఏర్పాటుకు 50శాతం నిధులను తామే భరిస్తామని రాష్ట్ర సర్కారు ప్రకటించింది.
కేంద్రానివి కుంటి సాకులు..
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని 2014లో కేంద్రం ప్రకటించింది. సెయిల్ బృందం బయ్యారంలో పర్యటించి కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం 200 మిలియన్ టన్నుల ముడి ఖనిజం కేటాయించాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నది. అనంతరం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం బయ్యారంలో పర్యటించి ఇక్కడ లభించే ఖనిజం నాణ్యత, పరిమాణం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సరిపోదని సాకులు చెప్పింది. ఈ ప్రాంతంలో కొండలు, గుట్టలు ఉండడం, అటవీప్రాంతం కావడం వంటి అంశాలను మరో కన్పల్టెన్సీ సంస్థ బూచిగా చూపింది. ఇదే నిజమైతే సుమారు 200 మంది ప్రైవేటు పారిశ్రామిక వేత్తలు గనుల లీజు కోసం ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నారు.
సుమారు 200 ఎన్వోసీలు పెండింగ్లో ఉన్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని కేంద్రంపై ఒత్తిడి తేకపోగా ఇటీవల కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఫ్యాక్టరీ నిర్మాణమే సాధ్యం కాదని వ్యాఖ్యలు చేయడంపై ఉమ్మడి జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేవతా వస్త్రం.. ‘విమానాశ్రయ నిర్మాణం’
2014లో అప్పటి కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్తగూడేనికి విమానాశ్రయం కావాలని ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా అప్పుడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ఎట్టకేలకు స్పందించి 2016లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ను అధ్యయనానికి సిఫార్సు చేసింది. దీంతో అధికారుల బృందం లక్ష్మీదేవిపల్లి మండలంలోని పునుకుడు చెలక గ్రామంలో 1600 ఎకరాల స్థలాన్ని పరిశీలించింది.
ఈ ప్రాంతం అభయారణ్యం కింద ఉంటుందని భావించి ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది. తర్వాత పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ సమీపంలో ఓ స్థలాన్ని పరిశీలించింది. కాలుష్యపరమైన అడ్డంకులు వస్తాయని భయపడి బృందం వెనుదిరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు.
గిరిజన యూనివర్సిటీ ఊసే లేదు..
ఉమ్మడి జిల్లావ్యాప్తలో ఆదివాసీలు, గిరిజనుల జనాభా ఎక్కువ. భద్రాద్రి కొత్తగూడెం పూర్తిగా ఆదివాసీ జిల్లా. ఈ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సహా వామపక్షాలు దశాబ్ద కాలంగా ఆందోళనలు చేస్తున్నాయి. విశ్వవిద్యాలయ ఏర్పాటుకు అవసరమైన అన్ని వసతులు ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు
రైల్వేలైన్ కథ కంచికేనా..?
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): భద్రాచలానికి రైల్వే లైన్ వస్తే భద్రాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది. జిల్లాకు రాకపోకలు ఎక్కువగా ఉంటే వ్యాపార లావాదేవీలూ పెరుగుతాయి. బూర్గంపహాడ్లోని పాండురంగాపురం నుంచి ఏపీలోని కొవ్వూరుకు రైల్వేలైన్ ఏర్పడితే ఈ కల సాకారం అవుతుంది.
కేంద్రం మాత్రం ప్రస్తుతం పాండురంగాపురం- సారపాక (భద్రాచలం) రైల్వే లైన్కు మొక్కుబడిగా అనుమతులు ఇచ్చింది. అటవీశాఖ అనుమతులు రాక నిధులు విడుదలైనా పనులు ప్రారంభం కాలేదు. ఈ పనులే పూర్తి కాలేదు. ఇక పాండురంగాపురం- కొవ్వూర్ రైల్వేలైన్కు ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియని పరిస్థితి. బీజేపీ ప్రభుత్వాని కంటే ముందు యూపీఏ ప్రభుత్వం కొనసాగినప్పటి నుంచి ఈ ప్రాంత వాసులు రైల్వే లైన్ కోసం పోరాడుతున్నారు. ఇప్పటికీ అది కలగానే మిగిలిపోయింది.