భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 26 (నమస్తేతెలంగాణ) : వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పట్టణ ప్రగతి వివిధ అంశాలపై మున్సిపల్ ప్రత్యేక అధికారులు, కమిషనర్లు, డీఈలు, ఏఈలు, టీపీవోలతో ఆయన సమీక్ష నిర్వహించారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తాగునీటి సమస్య ఉండకూడదని అన్నారు. పట్టణ ప్రగతిపై అధికారులు దృష్టి సారించాలని, విద్యుత్, రహదారుల నిర్వహణపై శ్రద్ద తీసుకోవాలన్నారు. వైకుంఠదామాలు, సమీకృత మార్కెట్ల నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయని, కోట్ల విలువ చేసే పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఐదుగురు కూలీలతో పనులు చేయిస్తుంటే ఆ పనులు ఎప్పటికీ పూర్తి అవుతాయన్నారు.
ఇంజినీరింగ్ అధికారులు అలసత్వం వహిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఈఈకి, డీఈఈకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పట్టించుకోవడం లేదని అన్నారు. సమీకృత మార్కెట్ నిర్మాణంలో ఎలాంటి ప్రగతి లేదన్నారు. గతనెలలో జరిగిన సమావేశానికి ఇప్పటికి ఎలాంటి మార్పు లేదన్నారు.
అగ్రిమెంట్ సమయం పూర్తి అయిపోయిందన్నారు. వ్యర్థాల సేకరణకు ఉపయోగించే వాహనాల ఇంధన వినియోగంపై పర్యవేక్షణ చేయాలన్నారు. 15 రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో కేటాయించిన క్రీడాప్రాంగణాలను వెంటనే సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారులు అర్జున్, కమిషనర్లు నవీన్, శ్రీకాంత్, అంకుశ్అలీ, మాధవి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.