ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 26: గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఖమ్మం ఏఎంసీలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. రెండు వారాల నుంచి మార్కెట్కు పంట రాక వేగం పుంజుకుంటున్నది. ఈ ఏడాది భారత పత్తి సంస్థ (సీసీఐ) క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,380 ప్రకటించగా ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.8 వేలకు పైగా చెల్లించి పత్తి కొనుగోలు చేశారు. రైతులు బుధవారం ఉదయం మార్కెట్కు సుమారు 5 వేల బస్తాలు తీసుకొచ్చారు. ఈ- బిడ్డింగ్లో ఖరీదుదారులు క్వింటాకు గరిష్ఠంగా రూ.8,113, మధ్య ధర రూ.7 వేలు, కనిష్ఠ ధర రూ.6 వేలు ప్రకటించి కొనుగోలు చేశారు. ఏఎంసీ చైర్పర్సన్ డౌలే లక్ష్మీప్రసన్న సెక్రటరీ మల్లేశంతో కలిసి క్రయవిక్రయాలను పరిశీలించారు. వారి వెంట అసిస్టెంట్ సెక్రటరీ రాజేంద్రప్రసాద్, పర్యవేక్షకుడు వాసాల వెంకటేశ్వర్లు ఉన్నారు.
మిర్చి బస్తాల రాక..
వానకాలంలో సాగు చేసిన మిర్చి ఇప్పుడిప్పుడే చేతికివస్తున్నది. కార్తీమ మాసం తొలిరోజు బుధవారం మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు కొత్త పంటను మార్కెట్కు తీసుకొచ్చాడు. క్వింటా మిర్చికి రూ.8,011 చొప్పున ధర పలికింది. ఏసీ మిర్చి క్వింటాకు గరిష్ఠ ధర రూ.22,650, మధ్య ధర రూ19,500, కనిష్ఠ ధర రూ.18,500 చొప్పున ఖరీదుదారులు కొనుగోలు చేశారు. సాధారణ మిర్చి క్వింటాకు గరిష్ఠ ధర రూ.17 వేలు, మధ్యధర రూ.15 వేలు, కనిష్ఠ ధర రూ.13 వేల చొప్పున పలికింది.