కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 26: దేశం కోసం ప్రాణార్పణ చేసిన పోలీస్ అమర వీరుల త్యాగాల స్ఫూర్తితో ముందుకు నడవాలని ఏఆర్ అదనపు ఎస్పీ దూళిపాల్ల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర్బాబు సారథ్యంలో పోలీస్ అధికారులతో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ అనదపు ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశ ప్రజల సంరక్షణ కోసం ఎంతో మంది పోలీస్, జవాన్లు తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారన్నారు.
అలాంటి త్యాగధనుల స్ఫూర్తి బాటలోనే పౌరులంతో బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. 6వ బెటాలియన్ అదనపు కమాండెంట్ ఎస్. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజల సంరక్షణ కోసమే పోలీసులు 24గంటలు పని చేస్తున్నారన్నారు. అనంతరం ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, 6వ బెటాలియన్ అదనపు కమాండెంట్ ఎస్. శ్రీనివాసరావు, కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్ బాబు, ఏఆర్ డీఎస్పీ కే.వీ.ఆర్. సత్యనారాయణ కొత్తగూడెం ప్రకాశం మైదానంలో జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు.
కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ మీదుగా సూపర్ బజార్ సెంటర్ నుంచి లక్ష్మీదేవిపల్లి మండలంలోని సెంట్రల్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. సబ్డివిజన్ పరిధిలోని సీఐలు బత్తుల సత్యనారాయణ, లావుడ్యా రాజు, ముసుకు అబ్బయ్య, వసంత్, ఆర్ఐలు ప్రగడ కామరాజు, సోములు నాయక్, దామోదర్, ఎస్సైలు ప్రవీణ్, శ్రీరాముల శ్రీను, ఆలకుంట రాజేందర్, విజయలక్ష్మి, గణేశ్, ఆర్ఎస్సైలు రమాదేవి, కొర్రా ఆంజనేయులు, పీఆర్వో దాములూరి శ్రీనివాస్, సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు.