భద్రాచలం, జూలై 29: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఉపాలయంలో ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తిని బేడా మండపంలో ఉంచి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు.
పంచామృతాలు, నారికేళ జలాలు, పండ్ల రసాలు, తులసి మాలలు, గండకీ శిలలు, హరిద్రాచూర్ణం, సహస్రధారలతో ప్రత్యేక అభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం మహిళా భక్తబృందం బాధ్యులు లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేశారు.
భద్రాద్రి రామయ్యకు శుక్రవారం సందర్భంగా బెంగళూరు భక్తులు రూ.5 కోట్లతో తయారు చేయించి సమర్పించిన సర్వాంగ స్వర్ణ కవచాలను ధరింపజేశారు. ఈ ప్రత్యేక అలంకరణలో సీతారాములు మరింత రమణీయంగా భక్తులకు దర్శనమిచ్చారు.
తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, ఆరగింపు, నిత్య పూజలు, నిత్య హోమాలు, నిత్య బలిహరణం జరిపారు. అనంతరం బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి శాస్ర్తోక్తంగా నిత్య కల్యాణం నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న దాతలకు స్వామివారి ప్రసాదాలు, శేష వస్ర్తాలను అందజేశారు.