ఖమ్మం వ్యవసాయం, మే 23 : ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభమయ్యింది. మరో పదిహేను రోజుల్లో జిల్లాలో రుతువపనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తుగా రైతులకు విత్తనాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయశాఖ కార్యాచరణ రూపొందించింది. కొద్దిరోజుల క్రితమే జిల్లా వ్యవసాయశాఖ పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించిన ఇండెంట్ను తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్కు అందజేసింది. అందులో భాగంగా టీ సీడ్స్ కార్పొరేషన్ ఖమ్మం జిల్లాలో 75సహకార సంఘాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో 21 సొసైటీలకు జీలుగ, పిల్లిపెసర, జనుము రకాలకు సంబంధించిన విత్తనాలను సరఫరా చేసింది.
సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు విత్తనాల పంపిణీ ప్రారంభించారు. ఈ సంవత్సరం ఖమ్మం జిల్లాలో అన్నిరకాల పచ్చిరొట్ట విత్తనాలు కలిపి 17,762 క్వింటాల్ ఖమ్మం జిల్లాకు, 4,550 క్వింటాల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అవసరం కావచ్చని ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. నేటివరకు ఖమ్మం జిల్లా పరిధిలో 75 సొసైటీలకు జీలుగ 27,397 క్వింటాల్, జనుము 1,500 క్వింటాల్, పిల్లిపెసర 3వేల క్వింటాలను సొసైటీలకు చేరవేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 21 సొసైటీలకు గాను జీలుగ 5,177 క్వింటాల్, జనుము 275 క్వింటాల్, పిల్లిపెసర మరో 1,200 క్వింటాల్ను తరలించారు. రసాయనిక ఎరువుల వాడకం గణనీయంగా తగ్గించేందుకు పచ్చిరొట్ట విత్తనాలను విరివిగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.సరిత తెలిపారు. రైతులు పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకొని సేంద్రియ సాగు చేపట్టాలని సూచించారు. ప్రతి రైతుకు పచ్చిరొట్ట విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆసక్తి కలిగిన రైతులు ఆయా సొసైటీల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చన్నారు.