అశ్వారావుపేట, మే 23 : సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేందకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, దీన్ని ఎదుర్కొనేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నామని ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని నారంవారిగూడెం ఆయిల్ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది రైతులకు పంపిణీ చేయటానికి 65లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నామని, జూలై నుంచి మొక్కలు సరఫరా చేయనున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది నుంచి ఎకరాకు 50మొక్కలను మాత్రమే పంపిణీ చేస్తామని, ఇప్పటివరకు 57 మొక్కలు నాటడం వల్ల అంతర పంటలు సక్రమంగా పెరగడం లేదని, దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఉద్యానశాఖ యాదాద్రి భువనగిరి జిల్లాలోని 6వేల ఎకరాలను ఆయిల్ఫెడ్కు కొత్తగా కేటాయించినట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 12వేల ఎకరాలకు 2,700మంది రైతులు, ఖమ్మం జిల్లా నుంచి 8వేల ఎకరాలకు 2,297 మంది రైతుల నుంచి మొక్కల కోసం డిమాండ్ ఉందని, మొక్కల పంపిణీలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 15రోజులకు ముందుగానే రైతుల జాబితాను ప్రకటిస్తామని అన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు మొక్కల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న కొద్ది నెలల్లోనే ఖమ్మం జిల్లాలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు అవసరమైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని వేంసూరు మండలం కల్లూరిగూడెంలో గుర్తించామని, సుమారు 150 కోట్ల నిధులను సమకూర్చుకోనున్నామని తెలిపారు. ఆయన వెంట ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ వలపర్ల ఉదయ్కుమార్, ఫ్యాక్టరీ మేనేజర్ ఆకుల బాలకృష్ణ, ఆయిల్పాం రైతుల సంఘం రాష్ట్ర నాయకుడు రామచంద్రప్రసాద్, వెంకటేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.